సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను (విద్యుత్ అంబులెన్స్లు) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా నగర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలను విద్యుత్ శాఖ తీసుకువచ్చిందన్నారు.
విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే సెంటర్ బ్రేక్ డౌన్ విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ఈ ప్రత్యే క వాహనాలను అందుబాటులో ఉంచనున్నామన్నారు. అంతరాయం ఏర్పడితే టోల్ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేస్తే .. వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారని తెలిపారు. ప్రస్తుతం నగరంలో 57 సబ్ డివిజన్లు ఉన్నాయని, ప్రతి డివిజన్కు ఒక వాహనాన్ని కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజినీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది, అవసరమైన మెటీరియల్తో పాటు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు.
ప్రతి వాహనంలో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపం మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ వంటివి ఉంటా యి. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి భద్రతా పరికరాలు ఉంటాయి. కొత్తగా వచ్చిన వాహనాలు ట్రాన్స్ఫార్మర్లను తీసుకువెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా సిబ్బంది వాటిని సమయంలో తరలించడానికి, మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది. టీజీఎయిమ్స్(టీజీఏఐఎంఎస్) యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో సహయపడుతుందని, సిబ్బంది అవసరమైన ప్రదేశానికి వేగంగా చేరుకుంటారని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీలు ముషారఫ్ అలీ, వరుణ్ రెడ్డిలు పాల్గొన్నారు.