సిటీబ్యూరో, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రజల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఈనెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు కూడా శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని అధికారులు కోరారు. ఈవీఎం, వీవీ ప్యాట్స్ భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్ల వద్ద గట్టి భద్రత, సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన 20 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా కేంద్ర బలగాలు, రాష్ట్ర ప్రత్యేక బలగాలు, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వివరించారు.
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈ ఎన్నికల్లో 59.96 శాతం మాత్రమే నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే..2 శాతానికి పైగా ఓటర్లు తగ్గారు. మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో గత ఎన్నికలు, ఈసారి ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఈసారి స్వల్పంగా ఓటింగ్ పెరిగింది.