వ్యవసాయ యూనివర్సిటీ: నిరుద్యోగులుగా ఉంటూ ఫర్టిలైజర్స్ షాపులలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారే, శిక్షణ అనంతరం, సొంతంగా షాపులు నడుపుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇఇఐ రిటైర్డ్ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త, రీసోర్స్పర్సన్ డా॥ ఆర్.రత్నాకర్ అన్నారు. రాజేంద్రనగర్లోని జిల్లా రైతు శిక్షణ కేంద్రంలో ఫర్టిలైజర్స్ డీలర్లకు శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడారు. దేశంలో కూరగాయల సాగుపై పరిశోధన చేసిన అనుభవంతో చెబుతున్నానని, గతంలో ఏ ప్రభుత్వం కల్పించని అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. ఇతర రాష్ర్టాల కన్నా, మన నేలలు వాతావరణం సాగుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రైతు మూస పద్ధతిన సాగు చేయడం వల్లే గతంలో మంచి ఫలితాలు సాధించలేకపోయామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సాగుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రైతుకు భరోసా పెరిగిందని, మంచి ఫలితాలు సాధించడంతో ఫర్టిలైజర్స్గా తమ పాత్ర ముఖ్యమైందన్నారు. ఇప్పటికీ ఉన్నత చదువులు చదివి నిరుపయోగంగా ఉన్న నిరుద్యోగులకు రాని అవకాశం ప్రభుత్వం తమకు కల్పించిందన్నారు. మంచిగా శిక్షణ పొంది, రైతులకు అండగా నిలవాలన్నారు. రైతు శిక్షణ కేంద్రం (ఎఫ్టీసీ ) రంగారెడ్డి జిల్లా ఏడీఎ దివ్వజ్యోతి మాట్లాడుతూ రైతులకు ఆర్థిక దిగుబడులు సాధించడంలో ఫర్టిలైజర్స్ డీలర్ పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇప్పటికే 48 రోజుల శిక్షణలో భాగంగా 60 శాతం పూర్తి అయ్యిందన్నారు. రాష్ట్రంలో ప్రధాన మైన రైతు శిక్షణా కేంద్రాలకు తాండూర్, రంగారెడ్డి జిల్లాలోని క్రీడా హయాత్ నగర్, కరీంనగర్ జిల్లాలోని ముల్కనూర్ రైతు సహకార సంఘాలను ఇటీవల సందర్శించారని తెలిపారు. కార్యక్రమానికి కో ఆర్డినేటర్గా రిటైర్డు ఏడీఏ అనిల్ కుమార్ తదితరులు పాల్గొని శిక్షణ ఇచ్చారు.