బడంగ్పేట, డిసెంబర్ 15: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడంలో ఎందు కు అలసత్వం వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్ రావు హెడ్మాస్టర్, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లెలగూడ చల్లాలింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలను, మీర్పేట ప్రాథమికోన్నత పాఠశాలను డీఈవో సుసీందర్ రావు, ఎంఈవో కృష్ణయ్యతో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మధ్యాహ్నన భోజనం, బియ్యం, తరగతి గదులను డీఈవో పరిశీలించారు. పాఠశాలలో కరెం టు ఎందుకు లేదని, పురుగుల అన్నం ఎందుకు పెడుతున్నారని ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ని ప్రశ్నించారు. పాఠశాలలో పారిశుధ్యం సక్రమంగా లేదని, విద్యార్థులకు పరిశ్రభత గురించి ఎందుకు చెప్పడం లేదని ఉపాధ్యాయులను నిలదీశారు. 7వ తరగతిలో ఉన్న విద్యార్థులను లేపి బోర్డుపై పెన్సిల్ అని తెలుగులో రాయమన్నారు. విద్యార్థి తప్పు రాయడంతో తెలుగు ఉపాధ్యాయురాలు సుజాతపై మండిపడ్డారు. విద్యార్థులకు చిన్న చిన్న పదాలు రాయకపోతే ఎలా ? అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో మళ్లీ స్కూళ్లకు పరిశీలనకు వస్తానని.. విద్యార్థుల్లో మార్పు రాకపోతే హెడ్మాస్టార్, టీచర్ల సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.