సిటీబ్యూరో, సెప్టెంబరు 9 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాలో ప్రమాదాలు సంభవించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాలో పడి మహిళ మరణించిన ఘటనా స్థలాన్ని శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాకు ఇరువైపులా ఉన్న మారుతీనగర్, దామోదర్ సంజీవయ్యనగర్తో పాటు గాంధీనగర్, అశోక్నగర్ కాలనీ వరకు పరిశీలించారు. సర్ప్లస్ నాలాపై రెండువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని, గతంలో ఉన్న రిటైనింగ్ వాల్పైనే ఎత్తుగా చేపట్టాలని ఈ సందర్భంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కమిషనర్ను కోరారు. ఇందుకు కమిషనర్ రోనాల్డ్ రోస్ వెంటనే స్పందిస్తూ… ప్రతిపాదనలు సిద్ధం చేయాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. నాలా రిటర్నింగ్ వాల్పైన నిర్మాణాలు చేసిన, నాలా ఆనుకొని నిర్మించిన ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని సూచించారు.
రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన బఫర్ స్థలం నిర్దేశించిన మేరకు ఎంత ఉండాలో లేక్స్ అధికారులు, టౌన్ప్లానింగ్ అధికారులు తక్షణమే పూర్తి నివేదిక అందించాలని కమిషనర్ సూచించారు. దామోదర్ సంజీవయ్య నగర్ వైపు నాలాకు ఆనుకొని ఉన్న కొన్ని భవనాలు వరదకు కొట్టుకొనిపోయి పునాది లేకుండా ఉన్నాయని, వాటిపై కూడా దృష్టిసారించాలని చెప్పారు. భారీ వర్షాలు కురిసినపుడు ఆ శిథిల భవనాలు కుప్పకూలి పోయే ప్రమాదం ఉన్నందున వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాంధీనగర్ సబర్మతి బ్రిడ్జి వద్ద నాలాను పరిశీలిస్తుండగా… ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన రిటైనింగ్ వాల్పైన కొందరు ఇంటి యజమానులు ఎక్స్టెన్షన్ పనులను గమనించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని సర్కిల్, జోనల్ టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆ నిర్మాణాలను వెంటనే తొలగించారు. రిటైనింగ్ వాల్ లోపల నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇందిరాపార్కు అభివృద్ధికి ప్రతిపాదించిన పనులను వెంటనే చేపట్టాలని కమిషనర్ యూబీడీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఇందిరాపార్కు అభివృద్ధికి ప్రతిపాదించిన పనులను కమిషనర్ సమీక్షించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కమిషనర్ వీ కృష్ణను కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. ఇందిరాపార్కు సుందరీకరణలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ ఆసక్తి ఉన్న ప్రతినిధులతో మొత్తం 12 కమిటీలు వేసిన దరిమిలా ఆదివారం కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. వారి ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, చర్యలు తీసుకోవాలన్నారు. పార్కులో ఉన్న స్కేటింగ్ గ్రౌండ్ మరమ్మతులు చేపట్టాలని కమిషనర్ను కోరగా… గ్రౌండ్కు సంబంధించిన నిష్ణాతులతో పరిశీలించిన తర్వాత మరమ్మతులు చేపడతామన్నారు. స్కేటింగ్ చూసేందుకు వచ్చే వారి కోసం ఎత్తుగా గ్యాలరీ నిర్మాణం, దాని కింద వాష్రూం, టాయిలెట్స్, ఇతర వసతుల కోసం అనువైన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని జోనల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ సందర్బంగా కమిషనర్ యూబీడీ, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలు చేపట్టాల్సిన 23 పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి సమీక్షించారు. అంతకుముందు కమిషనర్ కవాడిగూడలోని గోశాలను సందర్శించి, అందులోని వ్యర్థాల తరలింపు ప్రక్రియపై నిర్వాహకులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెత్త, ప్లాస్టిక్ వ్యార్థలు వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కమిషనర్ వెంట సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, లేక్స్ సీఈ, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్కుమార్, టౌన్ప్లానింగ్ సీసీపీ రాజేంద్రప్రసాద్ నాయకుడు, డీసీ తిప్పర్తి యాదయ్య, లేక్స్ ఎస్ఈ నాంద్, ఈఈలు, తదితరులు పాల్గొన్నారు.