దుండిగల్,జనవరి 28 : నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమనిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా కూల్చివేతల పరంపర కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకోకుండానే నిర్మించిన భవనాలతో పాటు అనుమతులకు మించి నిర్మించిన అదనపు అంతస్తులను హెచ్ఎండీఏ అధికారులు, నిజాంపేట కార్పొరేషన్ స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎస్టీఎఫ్) అధికారులతో కలిసి తొలగిస్తున్నారు. గురువారం సర్వేనంబర్ 92లో ప్రశాంతిహిల్స్లోని మూడు భవనాలను కూల్చివేసిన అధికారులు శుక్రవారం సర్వేనంబర్ 233/ఓ, సాయినాధ్నగర్ కాలనీలో నిర్మించిన భవనాలను తొలగించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జే.శంకరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా నిర్మించే అక్రమభవనాలతో పాటు అనుమతులకు మించి నిర్మించే అంతస్తుల కూల్చివేతలు క్రమం తప్పకుండా కొనసాగుతాయన్నారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో డిసెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు 40 భవనాలను కూల్చివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కూల్చివేతల్లో హెచ్ఎండీఏ ఫ్లానింగ్ అధికారి గోపికరమ్య, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి సుధీర్తో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు, పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.