సిటీబ్యూరో, జనవరి 21(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో చోటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ కూల్చివేతల పరంపర కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ఉన్న మునిసిపాలిటీల్లో అక్రమ నిర్మాణలపై హెచ్ఎండీఏ కొరడా ఝులిపిస్తోంది. ఐదు రోజులుగా కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్లో మొత్తం 58 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం అధికారులతో పాటు జిల్లా టాస్క్ఫోర్స్ బృందాలు శుక్రవారం నాలుగు మునిసిపాలిటీల పరిధిలోని 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు మూడు అక్రమ గోదాములను సీజ్ చేశామని తెలిపారు. మేడ్చల్, పెద్ద అంబర్పేట, నార్సింగి, షాద్నగర్ మునిసిపాలిటీల పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. ప్రధానంగా నార్సింగి మునిసిపాలిటీ పరిధిలో అనధికారంగా నిర్మిస్తున్న రెండు గోదాములను సీజ్ చేశామన్నారు. 600 గజాలకు పైబడి ఉన్న స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ముందుగా గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. హెచ్ఎండీఏ పరిధిలోని నాలుగో జోన్ లైన్లో శంషాబాద్, మేడ్చల్, శంకర్పల్లి, ఘట్కేసర్ల పరిధిలో మొత్తం 203 అక్రమ నిర్మాణాలను గుర్తించామని, వీటన్నింటినీ స్పెషల్ డ్రైవ్లో కూల్చివేస్తామని తెలిపారు.