సిటీ బ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): పోస్టల్, కొరియర్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రట్టు చేసింది. జార్ఖాండ్ కేంద్రంగా ఈ అక్రమ రవాణా సాగిస్తున్న నెట్వర్క్ సూత్రధారి సత్యం మిశ్రాను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను సీపీ సజ్జనార్ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. జార్ఖాండ్ రాష్ర్టానికి చెందిన సత్యం మిశ్రా గతంలో లారీ డ్రైవర్గా పనిచేసేవాడు.
2018లో గంజాయికి బానిసై సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో శుభమ్ మిశ్రా, సచిన్ మిశ్రా, రాహుల్ ఝా, సంతోష్ పండిట్తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి వ్యాపారంలోకి దిగారు. తన స్వగ్రామంలోనే గంజాయిని పండించి ముంబయి, చెన్నై, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ, బెంగళూరు సహా 12 రాష్ట్రాల్లో కస్టమర్లను ఏర్పరచుకుని విక్రయాలు సాగిస్తున్నారు. ఈ ముఠా ఇలా రోజుకు సగటున 80 నుంచి 10 ఆర్డర్లు పూర్తిచేస్తూ ఏడాదికి రూ.2 కోట్లపైగా సంపాదిస్తున్నారు. పోలీసుల కళ్లు కప్పేందుకు పార్సిళ్లను మ్యాంగో, స్టిక్, ఫ్లవర్ వంటి కోడ్ పదాలను వాడుతూ వివిధ పరిమాణాల్లో విక్రయించేవారు.
ఈ నేపథ్యంలో ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీస్ ద్వారా హైదరాబాద్కు చెందిన ఒకరికి ఈ ముఠా గంజాయి పార్సిల్ పంపింది. సమాచారం అందుకున్న హెచ్న్యూ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో సైప్లె లింక్ బయటపడిందని సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన సుశాంత్ వ్యాస్, లడ్డు అనే వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ గైక్వాడ్ వైభవ్, ఇన్స్పెక్టర్లు బాలస్వామి, నాగార్జున, ఎస్సై మనోజ్ కుమార్, ఏఎస్సైలు చక్రపాణి, సుబ్బారావు, హెడ్కానిస్టేబుల్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.