సికింద్రాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా కంటోన్మెంట్ గులాబీ దళం రోజుకో కార్యక్రమానికి పిలుపునిస్తూ ప్రజల్లో కేంద్రం అవలంభిస్తోన్న వ్యతిరేక విధానలను ఎండగడుతుంది.
ఆర్మీ రోడ్ల మూసివేత, రోడ్ల విస్తరణకు మొండిచేయి, జనావాసాల్లోని డంపింగ్ యార్డుల తరలింపు, బజారు ప్రాంతాల రెగ్యులరేషన్తో పాటు తాజాగా తొలగించిన ఓట్లను పునరుద్దరించే వరకు అందోళనలు చేపడుతామని టీఆర్ఎస్ పార్టీ గట్టిగానే కేంద్రానికి హెచ్చరికలు జారీ చేస్తుంది.
ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉన్నా రక్షణ స్థలాల్లో నివాసముంటున్న వారికి కంటోన్మెంట్ బోర్డు ఎన్ని కల్లో ఓట్లు ఉండవంటుంది. ఏకంగా కంటోన్మెంట్ పరిధిలో సుమారు 28వేల ఓట్లను తొలగించి కనీస ప్రాథమిక హక్కును సైతం హరింపజేస్తున్న కేంద్ర వైఖరిని ఎండగడుతూ టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా మడ్ఫోర్డ్ లో మర్రి రాజశేఖర్రెడ్డి అందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలోని రక్షణశాఖ స్థలాల్లో ఉన్న బస్తీలను భూ మార్పిడి కింద క్రమబద్ధీకరిస్తే ఆపై కోల్పోయిన ఓటు హక్కును సైతం పొందవచ్చన్నారు.
ఓటు హక్కు కోల్పోయిన వారికి తిరిగి ఓటు హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న మైదానంలో బుధవారం నిరసన చేపట్టారు.
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు మాజీ సభ్యులతో పాటు మడ్ఫోర్డ్ అంబేద్కర్ హాట్స్ ప్రాంతానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు.
దాదాపు తొలగించిన 28వేల ఓట్లను తిరిగి పునరుద్ధరణ కోసం కోర్టుకు వెళ్లడం జరిగిందని, త్వరలోనే ఈ అంశంపై స్పష్టమైన ఫలితం వస్తుందని నేతలు మర్రి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు ఓటు హక్కు ఉంచి, కేవలం బోర్డు ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కును తొలగించడం అన్యాయం అన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లాస్య నందితా, బోర్డు మాజీ సభ్యులు శ్యాంకుమార్, పాండుయాదవ్, నళినికిరణ్తో పాటు నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, రాజుసింగ్, ప్రవీణ్యాదవ్, సాంబ ఆశోక్, వెంకట్రాములు, శ్రీను, పరుశరామ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.