బంజారాహిల్స్,ఆగస్టు 17 : ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఓ యువకుడు చోరీకి పాల్పడి కటకటాల పాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ పట్టణానికి చెందిన జన్నా రమేష్(28) టైల్స్ వర్క్స్ చేస్తుంటాడు. మూడేళ్లక్రితం నగరానికి వచ్చి కార్మికనగర్లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
ఇటీవల ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్ల కోసం తెలిసినవారందరి వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే నెలలు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దాంతో అప్పులను తీర్చేందుకు చోరీ చేయాలని నిర్ణయించుకున్న రమేష్ ఈ నెల 15న రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న చేపల వ్యాపారి అంజనేయులు ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించాడు.
అల్వారాలో ఉన్న రూ.25,500నగదు, ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. సమీపంలోని సీసీ ఫుటేజీల సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.