Crime News | బండ్లగూడ, జనవరి 29: అది ఖరీదైన స్థలం. చూస్తూ ఊరుకోలేకపోయారు కబ్జారాయుళ్లు. అమెరికాలో ఉన్న యజమాని వస్తాడా? వచ్చి ఏమైనా చేస్తాడా? ఆ లోపే భూమిని మింగేస్తే పోలా! అని యజమాని చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. పనిలో పనిగా ఓ నకిలీ భార్యను తెరపైకి తెచ్చారు. ఇక రిజిస్ట్రేషనే తరువాయి అని సంబురపడ్డారు. సబ్రిజిస్ట్రార్ చాకచక్యంతో కబ్జా ముఠా గుట్టురట్టయింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన చెరుకూరి శ్రీనివాస్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.
ఆయనకు రాజేంద్రనగర్ మండల పరిధిలోని జనచైతన్య హౌసింగ్ సొసైటీలో 400 గజాల స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్రపన్నిన కొందరు వ్యక్తులు శ్రీనివాసరావు చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. ఆయనకు నకిలీ భార్యను సృష్టించి భర్త పేరున ఉన్న స్థలాన్ని భార్య పేరు మీదకు మార్చాలని ఇటీవల రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లారు.
భర్త ఎప్పుడు చనిపోయాడని సబ్ రిజిస్ట్రార్ ఆమెను అడుగగా, ఒకసారి ఐదేండ్ల కిందట, మరోసారి రెండేండ్ల కిందట అంటూ తడబడింది. అనుమానం వచ్చిన సబ్రిజిస్ట్రార్ లింకు పత్రాల ఆధారంగా అసలు భూమి యజమానికి సమాచారం అందించారు. సోమవారం శ్రీనివాసరావు రిజిస్ట్రర్ ఆఫీస్కు హాజరై ఒరిజినల్ పత్రాలను చూపించారు. అలాగే నిందితులపై రాజేంద్రనగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు.