సిటీబ్యూరో, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చాట్ జీపీటీతో తమకు కావాల్సిన మేసేజ్లు తయారు చేసి బాధితులకు పంపిస్తున్నారని, ప్రతి విషయాన్ని ప్రజలు గమనించాలని ట్రై పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డీసీపీలు సూచించారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఫిక్కీ లేడీస్ అర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో శుక్రవారం ‘అన్లాకింగ్ సైబర్ సీక్రెట్స్’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. అనంతరం, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీలు స్నేహా మెహ్రా, డాక్టర్ అనూరాధ, రిత్రాజ్లు మాట్లాడుతూ శత్రువులు ఎవరో..? మిత్రుడు ఎవరో..? అనే తేడాను ప్రజలు కచ్చితంగా గుర్తించాలన్నారు.
సైబర్ నేరాలలో బాధితులు ఎక్కువ మంది చదువుకున్న వారే ఉంటున్నారని, వీరిలో 95 శాతం ఉన్నత విద్యార్హత కల్గిన వారు, 80 శాతం సాఫ్ట్వేర్ నిపుణులే ఉంటున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరస్థులు ప్రజల భయాన్ని, దురాశను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి జాబ్ రాకెట్లో మోసానికి గురై రెండు రూ.2 కోట్లు పొగొట్టుకుందని అన్నారు. ఆ మహిళ 10 సెకెండ్ల నగ్న వీడియోను తెలియకుండా షేర్ చేసినందుకు ఆ మహిళ ఎంతో బాధపడుతున్నదని ఆమెకు నిపుణులైన కౌన్సిలర్లు రాచకొండలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఆమె తన భర్తతో వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు ఆలస్యమైనదని, అప్పటికే 100 వేరు వేరు ఖాతాల నుంచి ఆ డబ్బంతా కాజేశారని రాచకొండ సైబర్ క్రైమ్స్ డీసీపీ అనూరాధ తెలిపారు. ఆకర్షణీయమైన మేసేజ్లు తయారు చేసేందుకు సైబర్ నేరగాళ్లు చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారని, అలాంటి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు.
సైబర్ నేరం జరిగితే 1930కు ఫోన్ చేయాలని, ‘నేషనల్ సైబర్ క్రైమ్’ పోర్టల్లో రిపోర్టు చేయాలని డీసీపీలు సూచించారు. బ్యాంకు అధికారులమంటూ, ఉద్యోగాలంటూ, తక్కువ ధరకు వస్తువులని ఇలా సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ఫోన్లు చేసి ఆశ పెట్టి మోసం చేస్తారని వీటిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉపయోగించే కంప్యూటర్లు, సెల్ఫోన్, ల్యాప్టాప్ల సాఫ్ట్వేర్ సెక్యూరిటీ కూడా ఎంతో భద్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచించారు. ఎఫ్ఎల్ఓ చైర్ పర్సన్ రీతు షా మాట్లాడుతూ సైబర్ భద్రత అనేది ఒక సామాజిక బాధ్యత అని సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు మాగ్దా చెల్లీని గుర్తు చేశారు. ప్రో అర్చ్ సీఈఓ సంతోష్ కావేటీ ఈ ప్యానల్ చర్చ నిర్వహించారు.