సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని ఔషధ కంపెనీలు, మెడికల్ షాప్ల నిర్వాహకులు నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు ఔషధాలను అధిక ధరలకు విక్రయించే ఔషధ కంపెనీలు, మెడికల్ షాపులపై కొరఢా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల అధిక ధరలకు ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు రెండు రోజులుగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.173.39 కు విక్రయించాల్సిన ‘ఇట్రాకానజోల్ క్యాప్సల్-200ఎంజి’ 7 మాత్రలను రూ. 268 చొప్పున విక్రయిస్తున్న మెడికల్ షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఔషధాలను కూడా సీజ్ చేశారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్ రెడ్డి కథనం ప్రకారం.. సాధారణంగా ఔషధాల విక్రయాలకు సంబంధించి ఎంఆర్పీ ధరలను డ్రగ్స్ ప్రైజ్ కంట్రోల్ ఆర్డర్ 2013 ప్రకారం ‘నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ’ (ఎన్పీపీఏ) నిర్ణయిస్తుందన్నారు.
ఈ క్రమంలోనే హెటిరో హెల్త్కేర్ లిమిటెడ్ తయారు చేసిన ఔషధాలకు సైతం ఎన్పీపీఏ ఎంఆర్పీ ధరలను నిర్ణయించిందని పేర్కొన్నారు. అందులో భాగంగా యాంటీ ఫంగల్ చికిత్సకు వినియోగించే ‘ఇట్రాహెట్- 200’(ఇట్రాకానజోల్ క్యాప్సల్స్ బీపీ 200 ఎంజీ) మాత్రలకు సంబంధించి 7 మ్రాతల ఎంఆర్పీ ధర రూ.173.39గా నిర్ణయించిందన్నారు. ఒక మాత్ర ధర రూ.24.77 గా నిర్ణయించింది. అయితే, సదరు కంపెనీ మాత్రం 7 మాత్రల ధర రూ.286గా డబ్బాపై లేబుల్స్ ముద్రించి విక్రయిస్తున్నదన్నారు. ఈ క్రమంలో 7 మాత్రల డబ్బాను నిర్ణీత ధర కంటే రూ.112.61కు అధికంగా విక్రయిస్తున్నదన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు.. నగరంతో పాటు కొమరం భీమ్ ఆసీఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని పలు మెడికల్ షాపులపై దాడులు జరిపి, అధిక ధరలకు విక్రయిస్తున్న ఔషధాలను సీజ్ చేశారు. సంబంధిత ఫ్మార్మసీ షాపులకు నోటీసులు జారీ చేశారు. డీసీఏ డీజీ వి.బి.కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ టి.చందన తదితరులు పాల్గొన్నారు.
టోల్ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వండి: డీసీఏ డీజీ
ఔషధాలకు సంబంధించి జరిగే అవకతవకలు, ఎంఆర్పీ ధరల ఉల్లంఘన, గడువు తీరిన ఔషధాలను విక్రయించడం, నిలువ చేసుకోవడం, నిషేధిత, అనుమతి లేకుండా ఔషధాలు విక్రయిస్తే.. ఈ సమాచారాన్ని 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్కు ఇవ్వాలని డీసీఏ డీజీ వి.బి.కమలాసన్రెడ్డి ప్రజలకు సూచించారు. ఉదయం 10:30నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ టోల్ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందని, సమాచారం ఇచ్చినా, ఫిర్యాదు చేసినా.. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.