ఖైరతాబాద్, మార్చి 28 : అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలన్నింటిని దేశంలోని అన్ని రాష్ర్టాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. సోమాజిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జయగార్డెన్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాసోజు శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై కార్పొరేటర్ వనం సంగీతా యాదవ్తో కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్న సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ… దేశంలో, రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలున్నాయని, త్యాగాల పునాదుల పై నిర్మితమైన పార్టీ మనదని తెలిపారు. రాష్ట్రం అవతరించిన సమయంలో రూ.60వేల కోట్ల బడ్జెట్ ఉంటే… నేడు రూ.3లక్షల కోట్లపైగా బడ్జెట్ను ప్రవేశపెట్టి, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. 2014లో ఎలా ఉంది, 2023 హైదరాబాద్ ఎలా మారిందో అందరికీ వివరించాలన్నారు. నేడు ఐటీ కారిడార్కు వెళితే డల్లాస్ యూఎస్ఏకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని, ఐటీ, పరిశ్రమలతో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. టీఎస్ఐపాస్ పేరుతో రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆ ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, అనుబంధ సంఘాలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను బలోపేతం చేయాలని, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని సామాజిక మాధ్యమం ద్వారానే ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు దాసోజు పిలుపునిచ్చారు.
పింఛన్లు పెంచాలని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలెవరూ అడగలేదని, వారు అడగకుండానే సీఎం కేసీఆర్ మూడింతలు పెంచారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తద్వారా వారు ఆత్మగౌరవంతో జీవించే వీలు కల్పించారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు నరంలేని నాలుకతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ ప్రజయోజనాలకు ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు వనం సంగీతాయాదవ్, సోమాజిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎస్కె అహ్మద్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, కె.రామ్మూర్తి, సలావుద్దీన్, పి.నాగరాజు, ఉత్తమ్ జగన్, ఆనంద్ గౌడ్, గయాసుద్దీన్, రజిని, నాగలక్ష్మి, కరీం, ఫిరోజ్, సాధిక్, మోయిన్, ఖర్షిద్, మహేశ్ యాదవ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.