విశ్వనగరాభివృద్ధిలో భాగంగా బస్తీలను సైతం ప్రధాన రహదారులతో కనెక్టివిటీ కోసం ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. నగర నడిబొడ్డులో ఉన్న సోమాజిగూడ డివిజన్ ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటుకు గురైంది. చుట్టు పక్కల బహుళాంతస్తుల భవనాలు వెలిసినా బీఎస్ మక్తా, హరీగేట్ లాంటి బస్తీలు మురికి వాడలుగా మిగిలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బస్తీల అభివృద్ధికి అడుగులుపడ్డాయి. అందులో భాగంగా బీఎస్ మక్తాలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయగా, ప్రజలకు వైద్య సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి. తాజాగా లింకు రోడ్డు తరహాలో బీఎస్ మక్తా సమీపంలోని పార్కు హోటల్ నుంచి సమాంతరంగా కొత్త రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయితే నెక్లెస్రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా ట్రాక్ వెంట సమాంతర రోడ్డు రావడమే కాకుండా బస్తీ రూపురేఖలు మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
సమాంతర రోడ్డు నిర్మాణంలో భాగంగా బీఎస్ మక్తా హరిగేట్ ప్రాంతంలో 48 గృహాలను తొలగించనున్నారు. ఇప్పటికే గృహ యజమానులకు నోటీసులు అందజేశారు. అయితే వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. శుక్రవారం స్థానిక కార్పొరేటర్ వనం సంగీతా యాదవ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, డీఈ చైతన్య, ఈఈ ఇందిరా రాథోడ్తో కలిసి రోడ్డు నిర్మాణం చేపట్టనున్న గృహ సముదాయాలను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం చేపడితే సంవత్సరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ముందుగా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. అలాగే ముస్లిం శ్మశానవాటిక స్థలం కూడా ఈ రోడ్డులో పోతుండగా, పక్కనే ఉన్న శిఖం భూమిలో వారికి కావాల్సిన స్థలాన్ని గ్రేవ్ యార్డు కోసం కేటాయించాలని అధికారులను ఒప్పించారు.
కీర్తిలాల్ లేన్లోని ప్రస్తుతం రచ్చబండగా పిలుస్తున్న స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ నిర్మాణానికి లైన్ క్లియర్ చేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జెడ్సీ రవికిరణ్ను కోరారు. అందుకు కావాల్సిన కోటిన్నర రూపాయలను ఇప్పటికే మంజూరు చేయించామన్నారు. ప్రస్తుతం ఫంక్షన్హాల్ నిర్మాణ స్థలానికి సంబంధించిన వివరాలను టౌన్ ప్లానింగ్కు పంపించామన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కె అహ్మద్, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖుర్షిద్, వనం శ్రీనివాస్ యాదవ్, ఎ. శ్రీను, ఉత్తమ జగన్, అబ్బు, సలావుద్దీన్, జహంగీర్, రమేశ్, నర్సింగ్ తదితరులు ఉన్నారు.
-దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే