ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 31: నూతన జాతీయ విద్యావిధానం వల్ల రిజర్వేషన్లకు నష్టం జరుగుతుందని ఆలిండియా ఫోరం ఫర్ రైటు టు ఎడ్యుకేషన్ ప్రిసీడియం సభ్యుడు రమేశ్ పట్నాయక్ ఆరోపించారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ప్రోగ్రెస్సివ్ ఫోరం తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ‘నూతన జాతీయ విద్యా విధానం 2020 – పర్యావసనాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
ఐసీఎస్ఎస్ఆర్ గెస్ట్హౌజ్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రమేశ్ పట్నాయక్ హాజరై మాట్లాడారు. నూతన విద్యా విధానాన్ని పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదింపజేసుకున్నారని మండిపడ్డారు. విద్యను కేంద్రీకరణ చేస్తూ కార్పొరేటీకరణకు అనుకూలంగా మనువాదాన్ని పెంచి పోషించి, సామాజిక వివక్షతకు పునాదిగా చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రోగ్రెస్సివ్ ఫోరం రాష్ట్ర విభాగం నాయకులు డాక్టర్ రజిని, సత్య నెల్లి, బోస్, జంధ్యాల కల్పన, టీవీ సుబ్బరాయన్, డాక్టర్ సోమసుందర్, డాక్టర్ నారాయణరావు, స్టాలిన్, నారాయణ, నరేశ్, ఉదయ్కుమార్, బాలరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.