వరంగా మారిన దళిత బంధు
కంటోన్మెంట్ లబ్ధిదారులకు నిధులు
15 మంది ఖాతాల్లో డబ్బు జమ
కొత్త వెలుగులు నింపారని ఆనందం
బాకీ ఉందన్న రంది లేదు.. కిస్తీలు కట్టాల్సిన పని లేదు. 100 శాతం సబ్సిడీతో అందజేస్తున్న దళిత బంధు పథకం లబ్ధిదారుల పాలిట వరంగా మారుతున్నది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ పథకం కింద 100 మందిని ఎంపిక చేయగా..
బుధవారం 15 మంది అకౌంట్లలో ఆ నిధులు జమ అయ్యాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లూ
అప్పూసప్పూ చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న తాము.. ఈ డబ్బుతో వ్యాపారాలు పెట్టుకొని గౌరవంగా జీవిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్, ఏప్రిల్ 6: దళితుల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 15 మంది దళిత కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమయ్యాయి. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో దళితబంధు నిధులు జమ కావడంతో బుధవారం కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్నను కలిసి సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ జీవితాల్లో కొత్త వెలుగునింపారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు పిట్ల నగేశ్, మురళీయాదవ్, సదానంద్గౌడ్, అంజనేయులు, శ్రీను, అజయ్ పాల్గొన్నారు.
దళితులు ఆర్థికంగా ఎదగాలి..
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షలతో మంచి యూనిట్ను స్థాపించుకొని ఆర్థికంగా ఎదగాలి. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. దేశంలో 40కోట్ల మంది దళితులకు కేంద్ర ప్రభుత్వం 12వేల కోట్లు కేటాయిస్తే ఒక్క తెలంగాణలోనే రూ.17 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్దే.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్
మా కుటుంబానికి దేవుడు కేసీఆర్
మాది పేద కుటుంబం. దళితబంధు డబ్బులు మా అకౌంట్లో జమయ్యాయి. ఈ డబ్బుతో నిర్మాణ సామగ్రి (సెంట్రింగ్ వస్తువులు) కొని వ్యాపారం ప్రారంభిస్తాం. వాటిని కిరాయికి ఇచ్చి ఆదాయం పెంచుకునేలా ముందుకు సాగుతాం. మా కుటుంబంలో వెలుగు నింపిన దేవుడు సీఎం కేసీఆర్. దళిత కుటుంబాలకు అన్నితీర్ల ఆసరా అవుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– సానాది భవాని, మోండా డివిజన్
ఫొటో స్టూడియో పెట్టుకుంటా
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం. కూలీనాలీ చేసుకొని బతికే మాకు దళితబంధు పథకం కొండంత భరోసానివ్వనుంది. ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులతో కెమెరాలను కొనుక్కొని ఫొటో స్టూడియో పెడతాను. ఆర్థికంగా బలపడేందుకు సీఎం కేసీఆర్ ఎంతో సాయం చేస్తున్నారు. మా కుటుంబాలను ఇంకా మంచిగా సాదుకొనే అవకాశం ఇచ్చిన కేసీఆర్ సారును ఎన్నటికీ మరచిపోం.
– యాట పవన్కుమార్, మారేడ్పల్లి