హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జూబ్లీహిల్స్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొంటే కూలీ ఇస్తామని రోజువారి కూలీలను, ఆటోడ్రైవర్లను నమ్మించారు టీడీపీ శ్రేణులు.
ఉదయం 11:30 గంటలకు కూలీలు, ఆటో డ్రైవర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు వచ్చారు. అయితే కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ముగిసిన అనంతరం నాయకులంతా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇక కూలీలు, ఆటో డ్రైవర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గంట మీటింగ్ అని చెప్పి ఇక్కడకు తీసుకొచ్చారు. ఇప్పటికీ డబ్బులివ్వకపోవడంతో టీడీపీ డౌన్ డౌన్ అంటూ కూలీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఉంటున్న మమ్మల్ని మధు, మౌనిక అనే ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తీసుకొచ్చినట్లు కూలీలు తెలిపారు. డబ్బులు అడిగే సరికి ముఖం చాటేశారని, ఫోన్లు స్విచ్ఛాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.