సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): విదేశాలలో ఉండే భారతీయులకు.. వారి బంధువులకు తక్కువ ధరకు విమాన టికెట్లు సమకూరుస్తామంటూ సైబర్ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. గడిచిన నెల రోజుల్లోనే నేరగాళ్లు ఎనిమిది మందిని మోసగించి లక్షలు దోచుకున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు రకాల సైబర్ నేరాలతో సీసీఎస్ పోలీసులు అప్రమత్తమై అన్ని మార్గాల్లో నిఘా పెట్టారు. ఒక్కొక్కరిని పట్టుకుంటూ కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు కూడా రూట్ మార్చేశారు. డిస్కౌంట్లో విమాన టికెట్లు అంటూ తమ మోసాలకు కొత్త రూట్ను ఎంచుకున్నారు. ప్రజలకు లక్షల్లో కుచ్చుటోపీ పెడుతున్నారు.
ఈ వ్యవహారంలో నేరగాళ్లు, బాధితులు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. మొత్తం వ్యవహారం సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపు వేదికగానే నిర్వహిస్తున్నారు. ఫలానా వ్యక్తి డిస్కౌంట్లో విమాన టికెట్ ఇప్పించాడు.. అన్న మెసేజ్ను సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఈ ప్రచారం నేరగాళ్లకు బాగా కలిసి వస్తున్నది. ఈ మెసేజ్లు చూసిన పలువురు నిజమని నమ్మి.. నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. టికెట్ల కోసం డబ్బులు చెల్లించి లక్షలు పోగొట్టుకుంటున్నారు.
ఆకాశ్ జాజు అనే వ్యక్తి అమెరికాలో 50 శాతం డిస్కౌంట్తో ఇద్దరికి విమాన టిక్కెట్లు ఇప్పించాడు. అతడి వద్ద టికెట్లు తీసుకున్న వారు వాట్సాప్ గ్రూప్లో నంబర్ను షేర్ చేశారు.. అంటూ సైబర్ నేరగాళ్లు తమకు తాము సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఆ మెసేజ్ ఒకరి నుంచి మరొకరి గ్రూప్ల్లో సర్క్యూలేట్ అవుతూ జనంలోకి వెళ్లింది. విమాన టికెట్ల కోసం విదేశాల్లోనూ, ఇండియాలోనూ ప్రయత్నిస్తున్న వ్యక్తులు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్ గూర్చి తెలుసుకొని, నిజమని నమ్మి చేతులు కాల్చుకుంటున్నారు.
అమెరికాలో ఉన్న బంధువులు ఇటీవలే అమీర్పేట్లో ఉన్న తమ వారికి ఈ మేసేజ్ పంపించారు. ఆ మెసేజ్ను చూసిన అమీర్పేట వాసి.. అందులో ఉన్న నంబర్కు కాల్చేసి మాట్లాడాడు. నేరగాడు సూచించినట్లు డిస్కౌంట్ పోనూ టికెట్ల కోసం రూ.10.8 లక్షలు డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత నేరగాడు ఫోన్ స్విచాఫ్ చేశాడు. మోసమని గ్రహించిన బాధితుడు.. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రజలను నమ్మించేందుకు నేరగాళ్లు తొలుత ఒకరిద్దరికి 5 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్లో విమాన టికెట్లు ఇప్పిస్తున్నారు. ఈ సమాచారాన్ని పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. టికెట్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు రాగానే బిచాణా ఎత్తివేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ఈ తరహా నేరాలను చేస్తున్నారు. తక్కువ ధరకు విమాన టికెట్లు అంటూ ఎవరైనా ముందుకొస్తే అలాంటి వారి మాటలు నమ్మొద్దని సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ తరహా నేరాలపై గడిచిన నెల రోజుల్లోనే ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ప్రకటనలు చూసి నమ్మవద్దని సూచించారు.