బంజారాహిల్స్,ఫిబ్రవరి 20 : పార్ట్టైమ్ జాబ్( part-time job) కోసం చూస్తున్న మహిళను సైబర్ మోసగాళ్లు(Cybercrime) బురిడీ కొట్టించి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని శ్రీ వెంకటేశ్వనగర్లో నివాసం ఉంటున్న బి.నాగమల్లేశ్వరి అనే మహిళకు ఇటీవల ఇంట్లో ఉండే పార్ట్టైమ్ జాబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చంటూ వాట్సప్ ద్వారా ఓ మెసేజ్ వచ్చింది.
దానిలోని లింక్ ఓపెన్ చేయగా టెలిగ్రామ్ చానెల్ ద్వారా రూ.500నుంచి 2000 దాకా సంపాదించవచ్చని, ఇచ్చిన టాస్క్లను పూర్తిచేయాలని సూచించారు. చెప్పిన ప్రకారం రూ.500 చెల్లించి టాస్క్లను పూర్తిచేయడంతో ముందుగా రూ.1950 పంపించారు. నాలుగైదు సార్లు ఇదే విధంగా డబ్బులు రావడంతో పలు దఫాలుగా రూ.76,178 నాగమల్లేశ్వరి వారు సూచించిన అకౌంట్కు పంపించారు.
చెప్పిన టాస్క్లు పూర్తిచేసినా లాభం రాకపోవడంతో పాటు ఆదాయపు పన్ను కింద మరో రూ.10వేలు పంపించాలని కోరడంతో అనుమానం వచ్చి వాకబు చేయగా తాను సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయినట్లు తేలింది. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.