సిటీబ్యూరో: గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారని, ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ నగర ప్రజలను సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కేవైసీ అప్డేట్ చేయాలంటూ వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్లను క్లిక్ చేయడం, వారు పంపే ఏపీకే ఫైల్స్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయడం చాలా ప్రమాదకరమన్నారు. నేరగాళ్లు పంపే ఆ చిన్న యాప్ను డౌన్లోడ్ చేస్తే చాలు.. మొబైల్ నియంత్రణ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని, దీని ద్వారా ఫోన్కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య మెసేజ్లు నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరుతున్నాయని తెలిపారు.
ఇటీవల మహారాష్ట్రలోని డోంబివాలి ప్రాంతంలో జరిగిన ఘటనను ఆయన ఉదాహరణగా వివరించారు. ప్రముఖ గ్యాస్ కంపెనీ ప్రతినిధులమని చెబుతూ సైబర్ నేరగాళ్లు ఇద్దరు మహిళలకు ఫోన్ చేశారు. గ్యాస్ కనెక్షన్ సమాచారంతో పాటు కేవైసీని అప్డేట్ చేయాలని నమ్మించి వాట్సాప్లో ఒక ఏపీకే ఫైల్ పంపారు. ఆ మహిళలు వారు చెప్పినట్టే యాప్ ఇన్స్టాల్ చేయగానే వారి బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు పోయాయని సీపీ వివరించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలను నమ్మవద్దని కోరారు.