Cyber Crime | సిటీబ్యూరో: పేరున్న కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి, ఆయా సంస్థల ఫ్రాంఛైజ్ ఇస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీకి చెందిన బాధితుడికి ఇంటర్నెట్లో ఐటీసీ డిస్ట్రిబ్యూషన్. కామ్ అనే వెబ్సైట్ కనిపించింది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ డీలర్షిప్ ఇస్తామంటూ ఉండటంతో వివరాలు పొందు పరిచి, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 25 వేలు చెల్లించాడు. ఆ తరువాత వివిధ ఫీజుల పేరుతో రూ. 7.5 లక్షలు సైబర్నేరగాళ్లు వసూలు చేయడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
దీనిపై దర్యాప్తు ప్రారంభించిన సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు పాట్నా కేంద్రంగా దందా నడుస్తున్నట్లు గుర్తించారు. పేరున్న కంపెనీ పేరుతో నకిలీ వెబ్సైట్ తయారు చేసి, ఆయా కంపెనీల ఫ్రాంఛైజ్ ఇస్తామంటూ గూగుల్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేసుకుంటూ..అందిన కాడికి దోచేస్తున్నారు. ధీరజ్ కుమార్ అనే వ్యక్తి అంకిత్కుమార్, గౌరవ్కుమార్లతో కలిసి ఒక కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.