సిటీబ్యూరో, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): సైబరాబాద్లో 7 శాతం నేరాలు పెరిగాయని, పోలీస్స్టేషన్కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకొని ఎవరు చేసే పని వారు చట్ట ప్రకారం చేస్తూ కేసుల దర్యాప్తును పారదర్శకంగా చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచించారు. శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనరేట్ 2023 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… గత ఏడాది 27,322 కేసులు నమోదవగా 2023లో 29,156 కేసులు నమోదయ్యాయన్నారు.
ఆస్తుల రికవరీలో 9 శాతం పెరుగుదల ఉందని వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. 3432 కేసులలో నిందితులకు న్యాయస్థానాలు ఆయా కేసుల్లో జైలు శిక్షలు విధించాయని వివరించారు. సైబర్ నేరాలు ప్రతి యేడు పెరుగుతున్నాయని, అలాగే ఈ సంవత్సరం కూడా పెరిగాయని సైబర్నేరాల్లో పోయిన సొమ్ము విలువ రూ. 232.34 కోట్లు ఉండగా రూ. 46 కోట్లు రికవరీ చేశారని వెల్లడించారు. ట్రాఫిక్ విషయంలో ఎప్పకటిప్పుడు చర్యలు తీసుకోవాలని, అన్ని విభాగాల సమన్వయంతో మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఆర్థిక నేరాలు, భూ సంబంధిత నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉంటున్నాయని, వీటిపై ఎప్పకటిప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
చట్ట ప్రకారం ఎవరి పని వాళ్లు చేస్తూ వెళ్లాల్సిన అవసరముందన్నారు. పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ స్థాయిలో సమస్యను పట్టించుకోలేదంటే ఏసీపీ, అదనపు డీసీపీ, డీసీపీలకు ఫిర్యాదు చేయాలని అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తన వద్దకు సామాన్య ప్రజలు రావచ్చని సూచించారు. అధికారుల పనితీరుపై ఎప్పకటిప్పుడు పరిశీలన ఉంటుందన్నారు. పైరవీలతో పోస్టింగ్లు ఉండవని, పనితీరు ఆధారంగానే పోస్టింగ్లు ఉంటాయని తెలిపారు. డ్రగ్స్ కేసులలో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలుంటే చర్యలు తీసుకుంటామని, ఎన్డీపీఎస్ యాక్ట్లో అది ఉందని, దానిని అమలు చేస్తామన్నారు. డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్స్ తయారీదారులతో పాటు వినియోగదారులపై నిఘా కొనసాగుతుందన్నారు. న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే వారు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు శబరీష్, శ్రీనివాస్రావు తదితర అధికారులు పాల్గొన్నారు.