సిటీబ్యూరో, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిన డబ్బును పెద్ద ఎత్తున రికవరీ చేసి రికార్డు సృష్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో, ఇటీవల నమోదైన 44కేసులను ఛేదించడంతో పాటు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన రూ. 2.23కోట్లను రికవరీ చేసి, దానికి సంబంధించిన పత్రాలను బాధితులకు అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైమ్ డీసీపీ కల్వేశ్వర్, సైబర్క్రైమ్ డీసీపీ రితిరాజ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ విశ్వజి త్ కంపాటిలు కేసు పూర్వాపరాలను వెల్లడించారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా వాడకాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్మెంట్, పార్ట్-టైమ్ జాబ్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి, రూ.లక్షలను దండుకుంటున్నారు.
సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మి, దురాశతో లక్షల రూపాయలు పోగొట్టుకున్న 44మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ముందుగా ఎన్సీఆర్పీకి సమాచారం చేరవేయడంతో పాటు బాధితుల డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్లాయో గుర్తించి, సంబంధిత బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేయడం, డబ్బులు వచ్చిన ఖాతాను ఫ్రీజ్ చేయడం జరిగిందని అధికారు లు తెలిపారు. అనంతరం బాధితులచేత కోర్టులో పిటీషన్ దాఖలు చేయించి, కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించి, ఫ్రీజ్ చేసిన డబ్బులు తిరిగి బాధితులకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వివిధ కేసుల్లో డబ్బులు పోగొట్టుకున్న 44 మంది బాధితులకు సంబంధించిన రూ. 2,23,89,575ను రికవరీ చేశారు. దీనికి సంబంధించిన కోర్టు అనుమతి పత్రాలను ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలువురు బాధితులకు అందచేశారు. కాగా మిగతా కేసుల్లో కూడా దాదాపు 10 కోట్ల వరకు ఫ్రీజ్ చేశామని అవి న్యాయస్థానాల్లో విచారణ పూర్తవగానే ఆ కేసుల బాధితులకు కూడా న్యాయం జరగనుందని ఆయన వెల్లడించారు.
సాధారణంగా సైబర్ నేరాలు ఛేదించడం ఇతర కేసులతో పోల్చితే కొంత క్లిష్టమైన పనే. అందులోను డబ్బు లు రికవరీ చేయడం మరింత క్లిష్టమని, అందుకు పలు రకాల న్యాయపరమైన సమస్యలు, సాంకేతిక సమస్య లు ఉంటాయని, వీటిని సులభంగా అధిగమించి, బాధితులకు న్యాయం చేసేందుకు ఒక ప్రత్యేక ‘స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్'(ఎస్ఓపీ)ని రూపొందించినట్లు సైబర్క్రైమ్ డీసీపీ రితిరాజ్, క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్ వెల్లడించారు.
నాపేరు యశ్వంత్. మాది గాజుల రామారం. నేను సెల్ఫోన్ దుకాణం నడిపిస్తాను. నా బ్యాంక్ ఖాతాలో రూ.60 వేలు దాచుకున్నాను. ఒక రోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు మా కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పారు. ముందుగా నేను నమ్మలేదు. కాని వారు పదే పదే ఫోన్లు చేసి ఒక్కసారి పెట్టిచూడండి అన్నారు. పోతే పోతై లేక వస్తే వస్తై అని నేను రూ. 1000/- ఆన్లైన్ ద్వారా వారు ఇచ్చిన నెం బర్కు ట్రాన్స్ఫర్ చేశాను. నాకు రూ.1200 రిటర్న్ వచ్చాయి. అంటే వెయ్యికి రూ.200 వచ్చాయి. వచ్చింది తీసుకుని ఊకున్నాను. కాని వారు మళ్లీ ఫోన్ చేసి, ఇంకొంచెం ఎక్కువ పెడితే ఎక్కువ లాభం వస్తుందని నమ్మించిండ్రు. నేను రూ.5000పెట్టుబడిగా పెట్టాను. దానికి నాకు రూ.7వేలు వచ్చాయి. ఇట్లా పది, పదిహేను వేల దాకా పెట్టగా తిరిగి డబ్బులు వచ్చినయి. తరువాత వా ళ్లు మాటి మాటికి ఫోన్లు చేసి, నా చేత ఒకేసారి రూ. 2.95లక్షలు పెట్టించిండ్రు. గంతే ఇగ రూపాయి రాలే దు. వాళ్లకు పోన్లు చేస్తే పనిచేస్తలేదు. ఎంబడే మాకు దగ్గర్లో ఉన్న దుండిగల్ పోలీసులకు కైంప్లెంట్ చేసిన. వాళ్లు నాకు ధైర్యం చెప్పిండ్రు. మొత్తానికి నా పైసలను తిరిగి ఇప్పించిండ్రు. పోలీసులకు కృతజ్ఞతలు.
ఓ గుర్తు తెలియని వ్యక్తి 34 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 811 సైబర్ నేరాలకు పాల్పడి, రూ.111కోట్లు దోచుకున్నట్లు పోలీసు అధికారులు వివరించారు. అమాయకులు, డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారిచేత బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తారని, అనంతరం వారికి కొంత డబ్బు ఇచ్చి, ఆ ఖాతాలకు సంబంధించిన పాస్బుక్, ఖాతాకు అనుసంధానం చేసిన ఫోన్ సిమ్ కార్డు వంటివన్నీ తీసుకుంటారని వివరించారు. అనంతరం అమాయకుల నుంచి దోచుకున్న డబ్బును ఈ మ్యూల్ ఖాతాలోకి మార్పిడి చేసుకుని అక్కడి నుంచి వారి ఖాతాల్లోకి, ఆ తరువాత క్రిప్టో కరెన్సీకి మార్పిడి చేయడం జరుగుతుందని, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సైబర్ నేరగాళ్లు ఈ విధంగా మ్యూల్ ఖాతాలను వినియోగించుకుంటారని పోలీసు అధికారులు వివరించారు.