పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో ఎలా వ్యవహరిస్తారు? వారి ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తారు? ఫిర్యాదు రాయడం రాకపోతే సాయం చేస్తారా అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూకట్పల్లి పోలీస్స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మూడు గంటల పాటు కూకట్పల్లి స్టేషన్లో గడిపిన ఆయన ఠాణా సిబ్బంది పనితీరును పరిశీలించారు. ప్రతి ఇన్చార్జితో సమీక్ష చేసి లోపాలు ఉన్న చోట సూచనలు చేశారు.
పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అదేవిధంగా పోలీస్స్టేషన్ నిర్వహణ కోసం అవలంభిస్తున్న ‘5 ఎస్’ విధానాన్ని పరిశీలించారు. ప్రతిఒక్క సిబ్బందితో మాట్లాడి వారిలో ఉన్న అనుమానాలు, అపోహలను నివృత్తి చేశారు. నేర నియంత్రణకు సరికొత్త వ్యూహాలను రచించాలని అధికారులు, సిబ్బందిని కోరారు. స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలన్నారు. సీపీ వెంట మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడిన ఉత్తమ పౌరులకు రూ.5 వేల రివార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించగా.. అలాంటి వారిని గుర్తించి వివరాలు పంపాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కోరారు. కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఉత్తమ పౌరుల పేర్లను పరిశీలించి ఎంపిక చేస్తుందని అన్నారు. ఈ పథకం అక్టోబర్ 15 నుంచి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించిందని వివరించారు.