సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : సెక్టార్ ఎస్ఐలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. బాలానగర్ డీసీపీ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రైమ్ మీటింగ్లో సీపీ నేరాల నియంత్రణ, తదితర అంశాలపై జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సెక్టార్ ఎస్ఐలు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు.
నేరాలను తగ్గించేందుకు ఎస్ఐలు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలన్నారు. పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడం జరుగుతుందని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్స్పెక్టర్లు సైతం తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సంబంధిత డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల పనితీరును పర్యవేక్షించాలన్నారు. డీసీపీలు పక్షం రోజులకు ఒకసారి, ఏసీపీలు వారానికి ఒకసారి, ఇన్స్పెక్టర్లు, డీఐలు తరచూ సమీక్షలు నిర్వహించుకొని నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలని తెలిపారు. సెక్టార్ ఎస్ఐల పనితీరుపై ఇక నుంచి తానే స్వయంగా దృష్టి పెడుతానని సీపీ చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రవ్ సమయంలో అవసరమైతే లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.
శామీర్పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ ఇటీవల మృతిచెందగా.. బాధిత కుటుంబానికి పేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, శామీర్పేట ఇన్స్పెక్టర్ సుధీర్ సమక్షంలో రూ.25లక్షల చెక్కును అందచేశారు. ఈ సమావేశంలో సీపీతో పాటు ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, బాలానగర్ డీసీపీ సందీప్, అడ్మిన్ డీసీపీ ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.