సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఈనెల 4న పట్టుబడిన స్మగ్లర్ను తమదైన శైలిలో విచారించగా డ్రగ్స్ ముఠా మూలాలు కదిలాయి. ఈ క్రమంలో మరో ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.కోటి 33లక్షల విలువైన 303గ్రాముల కొకైన్, రెండు కార్లు, 5సెల్ఫోన్లు, వెయింగ్ మెషిన్ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు.
గుంటూరు జిల్లాకు చెందిన రాకేశ్ రోషన్(35)డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ నష్టపోయాడు. అయితే స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన రాకేశ్ అక్కడ ఓ పార్టీలో కొకైన్ రుచి చూశాడు. ఈ క్రమంతో తరచూ డ్రగ్స్ తీసుకొని మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. డ్రైఫ్రూట్స్ వ్యాపారం దివాలా తీయడంతో డ్రగ్స్ సరఫరాను వృత్తిగా ఎంచుకున్నాడు. గోవాలో నివాసముంటున్న నైజీరియన్ దేశస్తుడు ఎబ్యుజర్ అలియాస్ గబ్రియల్ వద్ద నుంచి రూ.7వేలకు గ్రాము చొప్పున కొకైన్ను కొనుగోలు చేసి నగరంలో అవసరమైన వారికి రూ.15వేల నుంచి రూ.18వేలకు గ్రాము చొప్పున విక్రయించడం మొదలు పెట్టాడు. అనంతరం హోటల్ వ్యాపారంలో నష్టపోయిన నెల్లూరు జిల్లాకు చెందిన గజ్జెల శ్రీనివాస్రెడ్డితో పాటు నిరుద్యోగి అయిన కాకినాడకు చెందిన సూర్యప్రకాశ్ అలియాస్ డేవిడ్ (26)లను డ్రగ్స్ వ్యాపారంతో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ప్రభావితం చేశాడు. దీంతో ఆ ఇద్దరూ కమీషన్ ఆధారంగా డ్రగ్స్ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు.
ఈనెల 2న గోవాకు వెళ్లిన సూర్యప్రకాశ్ నైజీరియన్ దేశస్తుడైన విక్టర్ చుక్వా వద్ద 23 గ్రాముల కొకైన్ కొనుగోలు చేశాడు. అనంతరం నగరానికి వచ్చి ఈనెల 4న మాదాపూర్ ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా గజ్జెల శ్రీనివాస్రెడ్డి, విక్టర్ చుక్వాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాడు. ఈనెల 4న గోవాకు వెళ్లిన గజ్జెల శ్రీనివాస్రెడ్డి నైజీరియన్ దేశస్తుడైన విక్టర్ చుక్వా వద్ద నుంచి 100గ్రాముల కొకైన్ను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా హైదరాబాద్లో కొకైన్కు మంచి డిమాండ్ ఉన్నదని, తనతోపాటు నగరానికి రావాల్సిందిగా చుక్వాను కోరాడు. దీనికి అంగీకరించిన విక్టర్ చుక్వా శ్రీనివాస్రెడ్డితో కలిసి ఈనెల 5న నగరానికి వచ్చాడు. వీరి రాకపై సూర్యప్రకాశ్ ద్వారా ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు రాకేశ్రోషన్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, వినియోగానికి సంబంధించి నైజీరియన్లతో నగరంలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే అంశాలపై ఆరాతీస్తున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇప్పుడు పట్టుబడిన నిందితులు గత 5సంవత్సరాలుగా డ్రగ్స్ దందా చేస్తున్నారని వివరించారు. నిందితులు డ్రగ్స్ వినియోగదారుల నుంచి వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ ద్వారానే లావాదేవీలు జరుపుతారని తెలిపారు. అయితే నైజీరియన్ దేశస్తుడైన గ్యాబ్రియల్ గోవాకు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్ను రవాణా చేసి, గోవా కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాలకు విక్రయిస్తాడని సీపీ వివరించారు. ప్రస్తుతం అతడి భార్య గర్భవతి కావడంతో గ్యాబ్రియల్ డ్రగ్స్ వ్యాపార బాధ్యతలను విక్టర్ చుక్వాకు అప్పగించి, స్వదేశానికి వెళ్లినట్లు తెలిపారు. నగరంలో డ్రగ్స్ వ్యాపారుల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తున్న పలువురు వినియోగదారులను గుర్తించామని, వారికి త్వరలోనే నోటీసులు జారీచేస్తామని చెప్పారు. పట్టుబడిన నిందితులను పోలీసు కస్టడీకి తీసుకొని డ్రగ్స్ దందాకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు రాబట్టనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గ్యాబ్రియల్కు డ్రగ్స్ స్మగ్లర్ కెల్విన్తో ఏమైన సంబంధాలు ఉన్నాయా అనే కోణలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే గ్యాబ్రియల్ను కూడా పట్టుకుంటామన్నారు. చాకచక్యంగా వ్యవహరించి డ్రగ్స్ రాకెట్ను రట్టు చేసిన మాదాపూర్ ఎస్ఓటీ, రాయదుర్గ పోలీసులను సీపీ అభినందించి, రివార్డులు ప్రకటించారు.