ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు..
కూలీలుగా మాటు వేసి.. ఆరు నెలలు నిరీక్షించి..
ధార్ ముఠా ఆటకట్టించిన పోలీసులు
వీడిన 98 కేసుల మిస్టరీ
సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): బొటనవేలి పై ఉన్న నాలుగు గీతల క్లూతో సైబరాబాద్ పోలీసులు అత్యంత కిరాతక దొంగల ముఠాను గురువారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ నాలుగేండ్లలో దేశవ్యాప్తంగా 400 చోరీలకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేయడంతో సైబరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ ముఠా చేసిన 98 దొంగతనాల మిస్టరీని ఛేదించగలిగారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్లోని ధార్కు చెందిన మాన్ సింగ్ మొత్తం 11 మందితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. 2018 నుంచి మార్చి 2022 వరకు తెలంగాణ ప్రాంతంలో సైబరాబాద్-68, నిజామాబాద్-10, కరీంనగర్-02, వరంగల్-06, జగిత్యాల-9, కామారెడ్డి-2, సిద్దిపేట-1 పోలీసు స్టేషన్ పరిధిలో నేరాలకు పాల్పడ్డారు.
ఆరు నెలల పాటు మాటు…
క్రైం డీసీపీ సింగన్వార్ కల్మేశ్వర్ సారథ్యంలో ఏసీపీ శ్యాంబాబు నేతృత్వంలో అదనపు డీసీపీ నరసింహారెడ్డి పరిశీలనలో బాలానగర్ సీసీఎస్ బృందం 98 చోరీ స్పాట్లను పరిశీలించి దేశవ్యాప్తంగా ఉన్న నేరస్తుల వేలి ముద్రలను సేకరించింది. ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదు. చివరకు మధ్యప్రదేశ్ డేటాను పరిశీలించినప్పుడు అక్కడ ధార్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కేసులో దొంగ బొటనవేలి అంచున ఉండే నాలుగు గీతలు సైబరాబాద్ పోలీసులు సేకరించిన అనుమానిత వేలిముద్రలతో సరిపోలింది. అతడి కోసం ఆరా తీస్తే…నిందితులంతా మధ్యప్రదేశ్ ధార్ కొండ ప్రాంతంలో ఉంటారని, వారు ఇప్పటికీ ఆదివాసీ జీవితాన్ని గడుపుతారని తెలిసింది. ఎవరైనా పోలీసులు వారి ప్రాంతానికి వచ్చారని తెలిసినా, కొత్తవారు వచ్చినా రాళ్లతో, బాణాలతో దాడులు చేస్తారు. వారిని పట్టుకోవడం అతి కష్టం. వారికి ఇప్పటికీ ఆధార్, ఓటరు కార్డులు లేవు. అసలు జనాభా లెక్కల్లో లేరని పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు సైబరాబాద్ టీం ధార్ సమీపంలోని 2 కిలో మీటర్ల దూరంలో రోడ్డు పనుల్లో కార్మికులుగా, కాంట్రాక్టర్ దగ్గర సూపర్ వైజర్గా పని చేస్తున్నట్లు మాటు వేశారు. అవకాశం దొరికినప్పుడల్లా నంబరు లేని వాహనాలపై అక్కడికి వెళ్లి.. ముఠాలోని సభ్యులు ఎవరైనా బయట ఉన్నారని తెలుసుకుని కీలక సమాచారం సేకరించారు. కిషన్సింగ్, రెమ్ సింగ్లను అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో బుధవారం మాన్ సింగ్, మొహబత్లను పట్టుకున్నారు. ఇంకా ఏడుగురు దొరకాల్సి ఉంది.