సిటీబ్యూరో: డ్రగ్స్కు అలవాటు పడి, మత్తు పదార్థాలు సరఫరా చేయడమే ప్రవృత్తిగా మార్చుకున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 2.45 లక్షల విలువ చేసే 15 గ్రాముల ఎండీఎంఏ, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…గుంటూరు జిల్లాకు చెందిన పొదిల జైచంద్కు ప్రకాశం జిల్లాకు చెందిన సోహన్ అలియాస్ శ్రీధర్ పరిచయమయ్యాడు. సోహన్ బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటు పడిన జైచంద్.. సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొన్నాడు.
ఈ క్రమంలో సోహన్ వద్ద ఎండీఎంఏను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. గత నెల 26న బెంగళూరులో అతడి వద్దే 20 గ్రాముల ఎండీఎంఏను కొని.. నగరానికి వచ్చాడు. అందులో నుంచి 5 గ్రాముల ఎండీఎంఏను సేవించిన జైచంద్.. మిగిలిన వాటిని విక్రయించేందుకు యత్నిస్తున్నాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు సన్సిటీ, పీ అండ్టీ కాలనీలోని జైచంద్ ఇంటిపై దాడులు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి..డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.