కుత్బుల్లాపూర్, మే 22: మహిళల భద్రత కోసం పోలీస్ వ్యవస్థలో నూతన సంస్కరణలు చేపట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో మీ భద్రతే.. మా బాధ్యత అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రధానంగా మహిళల భద్రతతోపాటు చిన్నపిల్లల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ ఆవరణలో మేడ్చల్, పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ల పరిధికి సంబంధించిన సీడీఈడబ్ల్యు కేంద్రంతోపాటు ఏవీ ఆడియో విజువల్స్ వెహికిల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు, చిన్నారులకు ప్రత్యేక భద్రతను కల్పించేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.
సైబరాబాద్ పరిధిలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ సీడీఈడబ్ల్యులో భాగంగా ఏడు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు రానున్నాయని తెలిపారు. ముందస్తుగా అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్స్టేషన్ ఆవరణలో సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా మహిళలు, చిన్నారులు, డొమెస్టిక్ వాయిలెన్స్, ఫ్యామిలీకి సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. ఈ సెంటర్లు ప్రారంభం కాకముందే అల్వాల్లో 183 కేసులు, పేట్ బషీరాబాద్లో 157 కేసులు వచ్చాయని, వాటికి పరిష్కార మార్గాలు చూపించామన్నారు.
మహిళలకు, చిన్నారులకు మరింత భద్రతను కల్పించేందుకు 100కు సమాచారం ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడ వాలి వారి భద్రత కోసం పని చేసే దిశగా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలపై దాడులు, ఇతర సంఘటనలు జరిగితే సత్వరమే పోలీసులను సంప్రదించాలనే అంశంపై అవగాహన కోసం నూతనంగా ఏవీ ఆడియో విజువల్స్ వెహికిల్స్ను ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో సైబరాబాద్ పరిధిలో మొయినాబాద్, ఆర్సీపురం, శంషాబాద్, రాజేంద్రనగర్లో కొత్త సెంటర్ల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ ప్రశాంత్, మేడ్చల్ సీఐ రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు, సిబ్బందితో పాటు కౌన్సిలింగ్ నిర్వాహకులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి: మహిళల భద్రతకు ప్రభుత్వం భరోసా ఇస్తున్నదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సోమవారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) కౌన్సెలింగ్ సెంటర్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ నికిత్పంత్, ఏసీపీలు రామలింగరాజు, వెంకట్రెడ్డి, సీఐ గంగాధర్, కౌన్సిలర్లు భవానీ, అర్చన తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు
జీడిమెట్ల: కుటుంబంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని (సీడీఈడబ్ల్యు ) ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మహిళలకు కుటుంబ సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదును స్వీకరించి భరోసా కౌన్సెలింగ్ సెంటర్కు పంపిస్తామన్నారు. కౌన్సెలింగ్ ద్వారా మహిళలకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ ఏసీపీ గంగారం, జీడిమెట్ల సీఐ ఎం.పవన్, జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్, సనత్నగర్ సీఐ ముత్తు యాదవ్, బాలానగర్ సీఐ భాస్కర్, దుండిగల్ సీఐ రామకృష్ణతో పాటు భరోసా కేంద్రం కౌన్సిలర్లు పాల్గొన్నారు.