Cyberabad | ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ ఉన్న మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లకు అదనంగా కొత్తగా ఏర్పాటైన లా అండ్ ఆర్డర్ రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్లలో ఫింగర్ ప్రింట్తో పాటు క్లూస్ టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జోన్ల వారీగా ఫింగర్ ప్రింట్ యూనిట్లు, డివిజన్ల వారీగా క్లూస్ టీమ్లను ఏర్పాటు చేశామన్నారు.
త్వరలోనే రిటైర్డ్ ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో సెంట్రలైజ్డ్ క్లూస్ టీమ్ హెడ్ ఆఫీస్ను ఏర్పాటు చేయనున్నామన్నారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి శాస్త్రీయ ఆధారాలతో సేకరణలో నాణ్యతను మెరుగుపరిచడం కోసం క్లూస్, ఫింగర్ ప్రింట్ యూనిట్లను పటిష్టం చేశామన్నారు. శాస్త్రీయ దర్యాప్తులో సహాయపడటానికి కీలకమైన ఆధారాలను భద్రపరచడానికి, సేకరించడానికి.. నిందితులకు శిక్షను నిర్ధారించడానికి వేగంగా సంఘటన స్థలానికి చేరుకోవాలన్నారు.
ఈ సందర్భంగా క్లూస్ టీమ్ హెచ్ఓడీ వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బంది పనితీరులో వర్క్ మానిటరింగ్, క్వాలిటీ ఎన్సూరింగ్, అకౌంటబిలిటీపై అవగామన కల్పించారు. నేరం జరిగిన ప్రదేశం ఆధారాల సేకరణలో నూతన సాంకేతిక పద్ధతులను అవలంభించాలన్నారు. తద్వారా సంక్లిష్టమైన కేసుల దర్యాప్తు వేగవంతమవుతుందన్నారు. ఈ సందర్భంగా కేసుల ఛేదనలో ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి సీపీ రివార్డులు అందించారు. సమావేశంలో సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగెన్వర్, హైదరాబాద్ క్లూస్ టీమ్ హెచ్ఓడీ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.