సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో పోలీసులు చేసే త్యాగాల వెనుక వారి కుటుంబ సభ్యుల పాత్ర వెలకట్టలేనిదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు పదవీ విరమణ చేసిన సందర్భంగా శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పదవీ విరమణ చేసిన వారిలో చందానగర్ పోలీస్స్టేషన్కు చెందిన ఎస్ఐ గణపురం శ్యామ్ ప్రసాద్, గచ్చిబౌలి పోలీస్స్టేషన్కు చెందిన ఏఎస్ఐ కె.నాగేశ్వర్రెడ్డి, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు చెందిన ఏఎస్ఐ కొండా సత్యనారాయణ గౌడ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్కు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ చిర్రా సత్యనారాయణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, అడ్మిన్ ఏడీసీపీ ఎఫ్.రెహ్మాన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ షమీర్, సీఏఓ అకౌంట్స్ వెంకట్రెడ్డి, ఏవో అడ్మిన్ జ్యోతిర్మణి, ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ఐ హిమకర్, సైబరాబాద్ పోలీస్ సహకార సంఘం ఇన్చార్జ్ జి.మల్లేశంతో పాటు పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, సహచరులు పాల్గొన్నారు.