Cyber Crime | సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్నేరగాళ్లు చేస్తున్న మోసాల్లో బాధితులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉంటున్నారు. వీరంతా ఒక ఉద్యోగం చేస్తూ.. డబ్బు వస్తుందన్న భావంతో పార్ట్టైమ్ ఉద్యోగం వైపు చూస్తున్నారు. ఇంట్లో ఉండే సమయంలో కొద్ది సమయాన్ని పార్ట్టైమ్ ఉద్యోగానికి కేటాయిస్తే అదనంగా ఆదాయం వస్తుందనే ఆలోచనలో ఉంటున్నారు. ఇది అవకాశంగా తీసుకుంటున్న సైబర్నేరగాళ్లు.. పార్ట్టైమ్ ఉద్యోగమంటూ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిని చూసిన బాధితులు స్పందిస్తూ నిట్టనిలువునా మునిగిపోతున్నారు. ఎక్కువ సంఖ్యలో నగర శివారు ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల నివాసాలు ఉండటంతో ఈ మోసాలకు సంబంధించిన కేసులు హైదరాబాద్, రాచకొండతోపాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా నమోదవుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నమ్మకం కలిగిస్తూ సైబర్నేరగాళ్లు మాటలు చెబుతున్నారు. ఈ మాటలతోనే సాఫ్ట్వేర్పై మంచి పట్టున్న వారు సైతం ఈజీగా బోల్తా పడుతున్నారు. ప్రధానంగా పేరున్న కంపెనీల పేర్లను సైబర్నేరగాళ్లు వాడుకుంటున్నారు. ఆయా కంపెనీల హెచ్ఆర్, సీఈఓల పేర్లతో బాధితులతో మాట్లాడుతున్నారు. ఫలాన కంపెనీ తన రేటింగ్ను పెంచుకోవడం కోసం యూట్యూబ్ సబ్స్క్రిష్షన్, రివ్యూస్ రాయించుకుంటుంది.. దీంతో ఆ కంపెనీ వ్యాపారం పెరుగుతుంది.. ఈ కాంట్రాక్టు మాకు ఇచ్చారు. ఇందుకు మేము పార్ట్టైమ్ ఉద్యోగులను నియమించుకుంటున్నాం.. అంటూ నమ్మిస్తూ బాధితులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇక్కడే సైబర్నేరగాళ్లకు బాధితులు చిక్కుతున్నారు.
పెట్టుబడులు తొలుత రూ.1,000 నుంచి రూ. 3వేలతో మొదలవుతుంది. బాధితులు క్లిక్ చేయగానే అనుమానం రాకుండా సైబర్నేరగాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాధితుల్లో నమ్మకం పెరిగేందుకు వెంటనే లాభంగా డబ్బులు వచ్చాయంటూ బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తున్నారు. ఈ నమ్మకమే బాధితుల కొంప ముంచుతోంది. ఆ తర్వాత పెట్టుబడులను రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు పెట్టిస్తారు. లాభాలు మాత్రం బాధితుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ కావడంలేదు. కేవలం వచ్చిన లాభాలను స్క్రీన్పై మాత్రమే కనిపించేలా చేస్తారు. వచ్చిన లాభాలు వెంటనే ఇవ్వకుండా, మరో స్కీమ్ పేరు చెప్పి బాధితుల్లో ఆశను కల్పిస్తారు. ఈ ఆశతోనే మరికొంత మంది బాధితులు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ.. సైబర్నేరగాళ్లు చెప్పినట్లు ముందుకు వెళ్తున్నారు. పెట్టిన డబ్బులు, లాభాలు రాకపోవడంతో కొంతమంది బాధితులకు అనుమానం కూడా వస్తుంది. అయితే, అక్కడితో ఆగిపోతే.. అప్పటి వరకు పెట్టుబడిగా పెట్టిన సొమ్ము తిరిగి రాదన్న భయంతో.. సైబర్నేరగాళ్లు చెప్పినట్టు విని పెట్టుబడి పెడుతూ.. భారీ మోసానికి గురవుతున్నారు.
పార్ట్టైమ్ ఉద్యోగమనేది ఫేక్ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చంటూ వచ్చే మెసేజ్లకు స్పందించి డబ్బు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. క్లిక్ చేస్తే ఎవరూ డబ్బులు ఇవ్వరు.. గుర్తు తెలియని వ్యక్తి ఎక్కడుంటాడో కూడా తెలియదు.. మెసేజ్ పెడితే గుడ్డిగా నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు. పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో వచ్చే మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.