కొండాపూర్, డిసెంబర్ 6 : సైబర్ సెక్యూరిటీ అనేది భారతదేశ వృద్ధికి, సుస్థిరతకు ఎంతో కీలకమని టీసీపీ వేవ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మురళీ సప్ప అన్నారు. మాదాపూర్ మైండ్స్పేస్లోని ద వెస్టిన్లో బుధవారం సీటీవో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీసీపీ వేవ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మురళీ సప్ప విచ్చేసి నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సైబర్ సెక్యూరిటీ భారతదేశ వృద్ధికి, సుస్థిరతకు ఎంతో కీలకమని, టీసీపీ వేవ్ పూర్తిగా డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.
డీఎన్ఎస్ సెక్యూరిటీ తన సృజనాత్మక సెక్యూరిటీ సొల్యూషన్లతో ప్రస్తుత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వ్యాపారాలు సజావుగా సాగేందుకు వీలు కల్పిస్తుందన్నారు. మన దేశంలో ఆర్థిక, వైద్య, ఐటీ, ఐటీఈఎస్, రిటైల్, ప్రభుత్వ రంగాలకు సైబర్ ముప్పు ఎక్కువగా ఉందన్నారు. ఈ పరిశ్రమలకు సైబర్ భద్రత కల్పించడంలో టీసీపీ వేవ్ ప్రత్యేకతను సాధించిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ మార్కెట్ విస్తృతంగా పెరుగుతుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడంలో మా సంస్థ ముందుంటుందని, ఎప్పటికప్పుడు నూతన సమస్యలు వాటిల్లుతున్నాయని.. అదే సమయంలో ఈ రంగంలో నిపుణుల కొరత బాగా ఉందని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో హైదరాబాద్ ప్రమాణాలు ఎంతో బాగున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో 30 సంస్థలకు చెందిన సీఈఓలు, 40 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు పాల్గొన్నారు.