సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో దూకుడు పెంచింది. దేశంలోనే తొలిసారిగా రూ.2.23 కోట్లు రికవరీ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. సైబర్ నేరాలను ఛేదించడంలో గుజరాత్ తర్వాత రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించిన మెగా డ్రైవ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ల నుంచి మొత్తం 14 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 143 కేసులకు సంబంధించి గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, వెస్ట్బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, యూపీ తదితర మొత్తం 9 రాష్ర్టాలకు వెళ్లి దర్యాప్తు చేపట్టినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ కేసుల్లో మొత్తం 19 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 45 డెబిట్ కార్డులు, 9 పాస్ పుస్తకాలు, ల్యాప్టాప్, స్వైపింగ్ మెషిన్, 11 చెక్బుక్లు, 26మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.