సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులు గత వారం రోజుల్లో ఐదు కేసులను ఛేదించి ఆయా కేసులలో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ నాగలక్ష్మి వెల్లడించారు. ఈ కేసుల్లో బాధితులకు రూ.21,60,112 రిఫండ్ ఇచ్చినట్లు తెలిపారు. మూడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఒకటి డిజిటల్ అరెస్ట్, లోన్ ఫ్రాడ్ కేసులలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
సైబర్ కేసుల దర్యాప్తులో మల్కాజిగిరి పోలీసులు రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉండే ఖాతాదారులపైనే దృష్టి సారిస్తున్నారు, సైబర్నేరగాళ్లకు ఖాతాలు సరఫరా చేస్తున్నవారు, ఆయా ఖాతాలలో డబ్బులు బాధితులు డిపాజిట్ చేసినట్లు దర్యాప్తులో తేలితే అలాంటి కేసులకు ప్రాధాన్యత ఇస్తూ మిగతా కేసులను పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేసుల మూలాల వరకు వెళ్లి నిందితులను పట్టుకోవడం, మూల్ ఖాతాలకు సూత్రధారులెవరో గుర్తించి ఆయా నెట్వర్క్ను ఛేదించడంపై దృష్టి సారించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు కేసులలో సుమారు రూ. 2.69 కోట్లు నష్టపోగా పోలీసులు కేవలం రూ.21.60 లక్షలు రిఫండ్ ఇప్పించారు. బాధితులు ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతూ ఫండ్ తెప్పిస్తూ అంతటితోనే ఆయా కేసుల దర్యాప్తు పూర్తయ్యిందనే బావనతో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. లోతైన దర్యాప్తు జరిపితే కీలక సైబర్నేరగాళ్లను పట్టుకోవడం, మూల్ ఖాతాల నెట్వర్క్ను తెగొట్టి, సూత్రధారుల వరకు కూడా వెళ్లేందుకు అవకాశాలున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు.