బేగంపేట, నవంబర్ 27: ఓటీపీ చెప్పకూడదని తెలియని ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డు నుంచి నగదును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఆదివారం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేట పాటిగడ్డకు చెందిన సిద్ధయ్య ప్రైవేట్ ఉద్యోగి. అతడి వద్ద రెండు ఎస్బీఐ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఒక కార్డును రద్దు చేసుకునేందుకు ఈనెల 17న ఎస్బీఐ కస్టమర్ కేర్కు ఫోన్ చేశాడు. అయితే, కస్టమర్ కేర్ నంబర్కు ముందు 1 చేర్చి తప్పుగా డయల్ చేశాడు. ఓ వ్యక్తి మాట్లాడాడు.
ఫోన్లో మాట్లాడిన వ్యక్తితో తన కార్డును రద్దు చేయాలని సిద్ధయ్య కోరాడు. సదరు వ్యక్తి కాల్ కట్ చేసి.. మరో నంబర్తో ఫోన్ చేశాడు. సిద్ధయ్య వద్ద ఉన్న రెండు క్రెడిట్ కార్డుల వివరాలు తీసుకున్నాడు. ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పమని కోరాడు. సిద్ధయ్య తనకు వచ్చిన ఓటీపీని అతడికి చెప్పాడు. 20 నిమిషాల్లో కార్డు రద్దు అవుతుందని చెప్పిన అగంతకుడు కాల్ కట్ చేశాడు. తన వద్ద ఉన్న రెండు కార్డుల నుంచి రూ.85,200 పోయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆదివారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.