Cyber Crime | హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల చేతిలో సామాన్యులు బలవుతూనే ఉన్నారు. లక్షల రూపాయాలను కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ క్రైమ్ డీసీపీ పేరిట ఓ సైబర్ నేరగాడు రూ. 12 లక్షలు కాజేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.
ఓ సైబర్ నేరగాడు.. హైదరాబాద్కు చెందిన డాక్టర్కు ఫోన్ చేశాడు. తనను తాను ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడి ఆధార్తో అనుసంధానంగా పలు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటి నుంచి రూ. 8 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని సైబర్ నేరగాడు బెదిరింపులకు పాల్పడ్డాడు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదైందని, రూ. 12 లక్షల 75 వేలు చెల్లించాలని డాక్టర్ను డిమాండ్ చేశారు. దీంతో భయపడిపోయిన డాక్టర్.. వారు కోరిన మొత్తాన్ని చెల్లించి, చివరకు మోసపోయినట్లు గుర్తించాడు. అనంతరం బాధిత డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి బెదిరింపులు వస్తే.. 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు.