cyber crime | సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఇన్వెస్ట్మెంట్ మోసాలకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహా జిత్తులతో అమాయకులకు వల వేస్తున్నారు. అందమైన అమ్మాయి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి ఆకర్శిస్తున్నారు. ప్రస్తుతం బంగారం మార్కెట్ బాగుంది.. పెట్టుబడులు పెడితే రోజుకు రూ.5 లక్షల వరకు సంపాదించవచ్చు.. అంటూ మెసేజ్లు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు పార్ట్టైం జాబ్స్, క్రిప్టో ట్రేడింగ్ పేరుతో అమాయకులకు వల వేసిన సైబర్నేరగాళ్లు.. తాజాగా కొత్త రూట్ను ఎంచుకొని భారీ ఎత్తున మోసాలకు పథకం రచించారు. అత్యాశకు పోతున్న చాలా మంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నేరగాళ్లు ఇలా సేకరించిన డబ్బంతా క్రిప్టో రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు దృష్టిసారించారు. ఈ ముఠాలను అరెస్టు చేస్తూ వస్తున్నారు.
తాజాగా బంగారం మార్కెట్పై..
రోజుకో కొత్త ఆలోచనతో మోసాలు చేస్తున్న సైబర్ చీటర్స్, ఇప్పుడు బంగారం మార్కెట్పై ఫోకస్ పెట్టారు. బంగారం మార్కెట్ చాలా హాట్గా ఉంది.. గోల్డ్ ట్రేడింగ్పై చర్చించేందుకు మీరు మా గ్రూప్లోకి రండి.. అంటూ మెసేజ్ ద్వారా ఆహ్వానిస్తున్నారు. ఇది నిజమని నమ్మిన చాలా మంది మోసపోతున్నారు. నేరగాళ్లు చెప్పినట్టు విని.. ట్రేడింగ్ చేయాలంటూ డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. నేరగాళ్లు తొలుత లాభాలు వచ్చినట్టు చూయించడంతో.. నిజమని నమ్మిన బాధితులు సంతోషంతో పొంగిపోయి.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు, వచ్చిన లాభాలను స్క్రీన్పై చూపిస్తున్న నేరగాళ్లు.. వాటిని డ్రా చేసేందుకు వీలు కల్పించడంలేదు. డబ్బులు డ్రా చేసేందుకు అవకాశం కల్పించాలని బాధితులు కోరగా.. పన్నుల పేరుతో మరింత డబ్బు వసూలు చేస్తున్నారు. ఆలస్యంగా సైబర్ నేరగాళ్ల మోసాన్ని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బంగారం మార్కెట్ పేరుతో తాజాగా మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు.. మెసేజ్లో కొంత మార్పు చేసి అమాయకులకు వల వేస్తున్నారు. మిగతా వ్యవహారమంతా పాత పద్ధతిలోనే ఉంటుంది. ఇలాంటి మెసేజ్లను నమ్మితే మోస పోవడం ఖాయం. గుడ్డిగా నమ్మి మోసపోవద్దు.. అని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.