సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : సీసీఎంబీలో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆ సంస్థ డైరెక్టర్ పేరుతో ఫేక్ మెయిల్ తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ అనురాధ కథనం ప్రకారం… కర్నూల్ జిల్లా, బేతంచర్ల మండలానికి చెందిన అందూరి ప్రవీణ్కుమార్ ప్రస్తుతం సంగారెడ్డిలోని కిష్టారెడ్డిపేటలో నివాసముంటున్నాడు.
సులభంగా డబ్బు సంపాదించాలని ఓ ఫేక్ ఖాతాను తెరిచి సీసీఎంబీలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి వివరాలు సేకరించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం సీసీఎంబీ డైరెక్టర్ దృష్టికి వెళ్లింది. వెంటనే అప్రమత్తమై రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ జి.వెంకటేశం నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు జె.నరేందర్గౌడ్, పరమేశ్వర్ బృందం నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు.