సిటీబ్యూరో: సైబర్నేరస్తుల ఆగడాలు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ఒకే రోజు.. మాయమాటలు చెప్పి.. బాధితుల నుంచి ఏకంగా రూ. 1.5 కోట్లను డిపాజిట్ చేయించుకున్నారు చైనా సైబర్ నేరగాళ్లు. ఖాతాలు అందిస్తున్న ఇక్కడి సైబర్నేరగాడికి కమీషన్ వదిలేసి.. మిగతాది డ్రా చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జాయింట్ సీపీ రంగనాథ్ కథనం ప్రకారం… ఏపీకి చెందిన శిరీష్కుమార్ చైనా సైబర్చీటర్స్తో సంబంధాలు పెట్టుకున్నాడు. దేశ వ్యాప్తంగా పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో సందేశాలు పంపిస్తూ, స్పందించిన వారికి టాస్క్ల పేరుతో పనులు ఇస్తామంటూ చైనా సైబర్నేరగాళ్లు నమ్మిస్తున్నారు. బాధితులకు వందల్లో ఆశ చూపుతూ.. టాస్క్ల కోసం లక్షలు వసూలు చేస్తున్నారు.
ఆ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో బాధితులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లను శిరీష్కుమార్ అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తికి టాస్క్ల పేరుతో ఆశ చూపి, రూ. 60 లక్షలు దోచేశారు. బాధితుడి ఫిర్యాదుతో సీసీఎస్ సైబర్క్రైమ్ బృందం..దర్యాప్తు జరిపింది. బాధితులు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాలను ఆరా తీయడంతో అది తిరుపతికి చెందిన శిరీష్కుమార్దిగా తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.