బాధితులకు ఫోన్ చేసి వేధింపులు
లోన్ తీసుకున్న వారితో పాటు తీసుకోని వారికి తప్పని బెదిరింపులు
వచ్చిన డబ్బులను ఇద్దరు పంచుకుంటూ..
సైబర్ నేరగాళ్ల కొత్త పంథా
భిన్న కోణాల్లో రుణ యాప్ కేసుల దర్యాప్తు
సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): లోన్ యాప్ వేధింపుల కేసుల్లో నిందితులు కొత్త పంథాను ఎంచుకున్నారు. అమాయకులకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. నేరగాళ్లలో ఒకరు లోన్ యాప్ల నుంచి డాటాను సేకరించి చేరవేస్తుండగా, మరొకరు వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వచ్చే ఆదాయాన్ని ఇద్దరు పంచుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి లోన్ పేరుతో పలువురికి ఫోన్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు వేధింపులకు పాల్పడుతున్నారు. లోన్ తీసుకున్న వారితో పాటు లోన్ తీసుకోని వారిని కూడా వేధిస్తున్నారు. ఇందుకు కొందరు లోన్యాప్ సంస్థల్లో పనిచేస్తూ అక్కడి కష్టమర్ల డాటాను బయటకు చేరవేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ డాటా సహాయంతోనే సైబర్ నేరగాళ్లు వేధిస్తున్నారని పోలీసులు గుర్తించారు. మీరు రుణం తీసుకున్నారు.. చెల్లించండి.. అంటూ బెదిరిస్తున్నారు. అంతేకాకుండా.. కాల్డాటా, యాప్ లింక్ ద్వారా ఇతరుల ఫోన్ కాల్ డాటాను సేకరిస్తున్న నిందితులు.. లోన్ తీసుకోని వారిని సైతం వేధిస్తున్నారు. మేము లోన్ తీసుకోలేదు.. మాకు ఎందుకు కాల్ చేస్తున్నారంటూ బాధితులు ప్రశ్నిస్తే.. మీరు లోన్ తీసుకోలేదు నిజమే.. మీ పేరుతో పలానా వ్యక్తి లోన్ తీసుకున్నాడు.. అతడు చెల్లించడంలేదు.. వీరు చెల్లించాలి.. అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఫొటోలు మార్ఫింగ్..
సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి వేధింపులకు గురిచేయడమే కాదు.. ఆయా నంబర్లలోని వాట్సాప్ డీపీల ద్వారా ఫొటోలు కూడా సేకరిస్తున్నారు. వాటిని కొందరు సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ కూడా చేస్తున్నారు. ఇలా మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఆయా కాంటాక్టులకు పంపిస్తున్నారు. మొదట సాధారణంగా ఉండే ఫొటోలను పంపిస్తున్నారు. ఆ తర్వాత మార్ఫింగ్ ఫొటోలు పంపించి వేధిస్తున్నారు. ఇలా అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం బీహార్కు చెందిన మనీష్ కుమార్ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వికాస్ కుమార్ పరారీలో ఉన్నాడు. వీరిలో వికాస్ కుమార్ డాటాను సేకరించి పంపిస్తుండగా, మనీష్ కుమార్ ఫోన్కాల్ చేసి బాధితులను వేధిస్తున్నాడు. వచ్చిన డబ్బును ఇద్దరు పంచుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రుణ యాప్ల సమాచారంతో నేరగాళ్లు చాలామంది అమాయకులకు ఫోన్చేసి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న పోలీసులు.. భిన్న కోణాల్లో లోన్ యాప్ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలోని బృందాలు ఢిల్లీ, బీహార్లో లోన్యాప్ నిందితుల కోసం గాలిస్తున్నాయి.