Cyber crime : సైబర్ క్రైమ్ దేశానికి పెను సవాల్గా మారిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐపీఎస్ల గౌరవందనాన్ని కేంద్రమంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన శిక్షణ పూర్తి చేసుకున్న ట్రెయినీ ఐపీఎస్ లకు అభినందనలు తెలియజేశారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ పోలీసింగ్ భవిష్యత్ కొత్త ఐపీఎస్ అధికారులపై ఆధారపడి ఉందన్నారు. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల అధికారులు కఠినంగా ఉండాలని సూచించారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉండాలని చెప్పారు. పెరుగుతున్న సైబర్ క్రైమ్ను కట్టడి చేయడానికి కృషి చేయాలన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా కేసులను తొందరగా పరిష్కరించాలని, నేరస్తులను పట్టుకొని వారికి తొందరగా శిక్షలు పడేలా చూడాలని సూచించారు.
కొత్త క్రిమినల్ చట్టాలపట్ల పోలీస్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కేంద్రమంత్రి చెప్పారు. కొవిడ్ టైమ్లో పోలీసుల సేవ గొప్పదని కొనియాడారు. భారత పోలీస్ సేవను అత్యున్నత స్థానంలో నిలబెడతారనే నమ్మకముందని అన్నారు. కాగా, 76వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పెరేడ్ ఘనంగా జరిగింది. పోలిస్ అకాడమీ నుంచి 54 మంది మహిళలు సహా 188 మంది ట్రెయినీ ఐపీఎస్లు పాసవుతున్నారు. వారిలోంచి ఏపీకి నలుగురు, తెలంగాణకు నలుగురు ట్రెయినీ ఐపీఎస్లను కేటాయించారు.