సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): తక్కువ ధరకే సామగ్రి, ఫర్నిచర్ అందిస్తామని ప్రకటనలు గుప్పించే వెబ్సైట్లతో జర జాగ్రత్త. నమ్మారో నట్టేట మునగడం ఖాయం. ముఖ్యంగా www.zopnow.in, www.modwayfurniture.in, www.deckup.com వెబ్సైట్ల ప్రకటనలు చూసి మోసపోయిన వారు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఈ వెబ్సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు రిషబ్ ఉపాధ్యాయను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వెబ్సైట్ల ఆకర్షణలో పడి ఎందరో మోసపోయారని.. వారు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బాధితులు సైబర్ క్రైం పోలీసులను 040-27854031, 9490617310 నంబర్లలో లేదా ఈ మెయిల్ sho-cyberacrimes@cyb.tspolice.gov.inలో సంప్రదించాలని కోరుతున్నారు.