ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారిని సైబర్నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు, ఉన్నత ఉద్యోగం కోసం యత్నించేవారు తమ రెజ్యూమ్ను జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేస్తుంటారు.. ఇంకొందరు సోషల్మీడియా, ఇతరాత్ర ఉండే ఉద్యోగాలకు సంబంధించిన వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తుంటారు. ఇక్కడి నుంచి సైబర్ నేరగాళ్లు డాటాను సేకరిస్తుంటారు. మరికొందరు పేరున్న జాబ్ పోర్టల్స్ నుంచి డాటాను తీసుకుంటారు.. ఈ డాటాతో నిరుద్యోగులకు ఫోన్ చేసి.. మీ సర్టిఫికెట్లను పరిశీలించాం.. మీకు ఫలానా ఉద్యోగం సరిపోతుంది.. అందులో చేరితే మంచి జీతం అంటూ వివిధ కంపెనీల పేర్లు చెబుతూ నమ్మిస్తుంటారు.. అలాగే ఈమెయిల్స్ పంపిస్తారు. దీంతో మంచి ఉద్యోగం వస్తుందనే సంతోషంతో నిరుద్యోగులు ఉంటారు.. ఈ క్రమం లో ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కడితేనే, ఉద్యోగానికి సంబంధించిన ప్రాసెసింగ్ మొదలవుతుందంటూ చెబుతారు.. మొదట రూ. 2వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తారు. ఆ తరువాత ప్రాసెసింగ్ ఫీ, సెక్యూరిటీ డిపాజిట్, హెల్త్ చెక్ అప్, జీతాల కోసం అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బు, కంపెనీ ఎండీ సంతకం అంటూ, ఆరు నెలల జీతం ముందుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయి ఉండాలని .. ఇలా రక రకాల పేర్లు చెబుతూ సైబర్నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తుంటారు.
ఉద్యోగాలు ఇప్పించేందుకు జాబ్ కన్సల్టెన్సీలు కొనసాగుతుంటాయి. వివిధ జాబ్ పోర్టల్స్ నుంచి ఆయా రెజ్యూమ్ డాటాను పరిశీలించి.. అందుకు తగ్గ ఉద్యోగం ఎక్కడుందని వెతికి, ఆ తరువాత దరఖాస్తు చేసుకున్న వ్యక్తితో సాధారణ జాబ్ కన్సల్టెన్సీల నుంచి ఫోన్లు చేసి మాట్లాడుతారు. అయితే సైబర్నేరగాళ్లు మాత్రం నేరుగా ఉద్యోగం కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే షరతు విధిస్తారు. ఇందుకు ప్రత్యేక కాల్సెంటర్లు ఏర్పాటు చేసి అందులో కంప్యూటర్లు, సెల్ఫోన్లు అందుబాటులో ఉంచి పలువురు యువతను టెలీకాలర్స్గా ఉద్యోగాల్లో నియమించుకుంటారు. ఈ టెలీకాలర్సే మోసం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. టెలీకాలర్స్కు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి డాటాను ఇచ్చి, వాళ్లకు ఫోన్లు చేయించి.. ఎలాగైనా వలలో చిక్కే విధంగా చేయాలనే మొదటి లక్ష్యాన్ని టెలీకాలర్స్కు అప్పగిస్తుంటారు. మాటలతో నిరుద్యోగ యువతకు ఆశ కల్పించి, ఎంత వరకు డబ్బు లాగితే వచ్చిన దాంట్లో తగిన కమీషన్ ఇస్తామంటూ కాల్సెంటర్ నిర్వాహకులు వారితో ఒప్పందా లు చేసుకుంటారు. దీంతో టెలీకాలర్స్కు ఒకరిని మోసం చేస్తున్నామనే విషయం తెలిసినా, తమకు వచ్చే కమీషన్ కోసం కక్కుర్తి పడుతూ అమాయకులను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు.
ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోమంటూ ఎవరైనా సూచిస్తే అది మోసమని గుర్తించండి. ఉద్యోగం కోసం ఎవరు కూడా డబ్బులు అడగరు. టాలెంట్ ఉన్నవాళ్లు డబ్బు ఇచ్చి పోవాలనుకోరు. ఉద్యోగం వస్తుందో రాదో అనే సందిగ్ధంలో ఉండేవారు మాత్రమే ఈజీగా సైబర్నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తక్కువ మొత్తమే కాదా అని రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఆ తరువాత వాళ్లు చెప్పినట్లు వింటూ.. డబ్బు చెల్లిస్తూ పోతున్నారు. కనీసం ఫోన్ చేసేది ఎవరు, మనం ఎవరీ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేస్తున్నామనే ఆలోచన కూడా చేయరు. ఫలానా సంస్థ నుంచి అంటూ సైబర్నేరగాళ్లు మాట్లాడుతున్నప్పుడే, బ్యాంకు ఖాతా కూడా అదే సంస్థ పేరుతో ఉండాలి. కానీ అలా ఉండదు. ఆ విషయాన్ని బాధితులు కూడా పట్టించుకోరు. తీరా సైబర్నేరగాళ్ల చేతిలో నిండా మునిగిన తరువాత తేరుకుంటున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు డబ్బు పెడితే ఉద్యోగాలొస్తాయనే ఆశ నుంచి బయటకు వచ్చి.. మోసగాళ్ల చేతిలో పడకుండా చూసుకోవాలి. – కేవీఎం ప్రసాద్, ఏపీపీ, సైబర్క్రైమ్ పీఎస్