సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): పసుపు కొమ్ములు కవర్లలో ప్యాక్ చేశారు. వాటిని సిస్సస్ పపుల్నెయ స్టెమ్గా నమ్మించారు. వాటిని అమెరికాకు ఎగుమతి చేసే కాంట్రాక్టు ఇప్పిస్తామంటూ చెప్పి.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 87.45 లక్షలు కాజేశారు. ఈ ఘటనలో నైజీరియన్తోపాటు మరో నలుగురిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను శుక్రవారం సీసీఎస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ శ్వేతా మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించారు. తార్నాకకు చెందిన బాధితుడు ఫార్మాలో పరిశోధకుడు. ఫార్మా తయారీదారుడు కావడంతో ముడిసరుకు కోసం ఇండియా మార్ట్ సైట్ను తరచూ సెర్చ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే లెక్సో ఫార్మా కంపెనీ పేరుతో ఇండియా మార్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రిస్టోఫర్ అలియాస్ డాక్టర్ అర్తుర్ విలయం పరిచయమయ్యాడు. ఇద్దరు కొన్ని రోజులు ఫార్మసీ గూర్చి మాట్లాడుకున్నారు.
తాను ప్రస్తుతం పర్చేస్ డిపార్టుమెంట్ నుంచి ప్రొడక్షన్ డిపార్టుమెంట్కు వెళ్తున్నాను.. నీకు మంచి వ్యాపార అవకాశాన్ని ఇస్తానంటూ నమ్మించాడు. ఇందుకు నీకు 60, నాకు 40 శాతం లాభాలు తీసుకుందామంటూ ఒప్పించాడు. ఈ మేరకు క్రిస్టోఫర్ తన మారు పేరైన డాక్టర్ అర్తుర్ విలయం పేరుతో ఒక ఈ మెయిల్ను గత ఫిబ్రవరి 6న బాధితుడికి పంపించాడు. అందులో ప్రతి నెలా 2000 ప్యాకెట్ల సిస్సస్ పపుల్నెయ స్టెమ్ అమెరికాకు పంపించాలి.. ఇందుకు ఇండియాలో విక్రయించే వారి వివరాలు నేను చెబుతాను.. అక్కడ కొనుగోలు చేసి ఇక్కడకు ఎగుమతి చేస్తే భారీగా లాభాలు ఉంటాయి.. అని చెబుతూ అన్నీ తానే చూసుకుంటానంటూ నమ్మించాడు. అక్కడ మోనికా శర్మ వద్ద కొనుగోలు చేయాలంటూ నంబర్ పంపించాడు. తమ కంపెనీ మేనేజర్ లారీ అంటూ మరో వ్యక్తిని ఫోన్లో పరిచయం చేశాడు.
ముందుగా మూడు ప్యాకెట్లు…
ముందుగా మూడు ప్యాకెట్లు కొని శాంపిల్ కోసం పంపించండి.. మా వాళ్లే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని కలుస్తారంటూ విలయం నమ్మించాడు. ఈ మేరకు ఒక్కో ప్యాకెట్కు రూ. 48 వేల చొప్పున రూ. 1.44 లక్షలు మోనికా శర్మకు పంపించాడు. బాధితుడి నుంచి డబ్బులు డిపాజిట్ చేయించేందుకు ఎవరికీ అనుమానం రాకుండా సియా ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక బ్యాంకు ఖాతాను తెరిచి అందులో డిపాజిట్ చేయించారు. మూడు ప్యాకెట్లు కొరియర్లో హైదరాబాద్కు పంపించారు. వాటిని తీసుకొని ఢిల్లీకి వెళ్లిన బాధితుడికి అక్కడ ఆఫ్రికన్ దేశస్తుడైన డానీ కలిశాడు. ఆ ప్యాకెట్లు తీసుకొని వెళ్లాడు. ఇక్కడే బాధితుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీ దిగుదాం.. కానీ నా ఫోన్లో నేను ఫొటో తీసి పంపిస్తాను.. అంటూ డానీ ఫోన్తోనే సెల్ఫీ తీసుకున్నారు. అదేరోజు సాయంత్రం మీ శాంపిల్స్ ఒకే అయ్యాయి.. ఇప్పుడు వెంటనే కంపెనీకి 200 ప్యాకెట్లు అవసరమున్నాయి.. వాటిని వెంటనే పంపించాలంటూ మెయిల్ పంపించారు.
దీంతో బాధితుడు క్రిస్టోఫర్తో మాట్లాడి.. వచ్చే లాభాల్లో ఇద్దరం పంచుకుందామనుకున్నాం.. పెట్టుబడిలో కూడా మీ వంతు ఉంటే బాగుంటుందని అడిగాడు. దీనికి క్రిస్టోఫర్ సరేనంటూ.. నా వంతుగా రూ. 20 లక్షలు పెట్టుబడి పెడుతున్నానని చెప్పాడు. ఈ మేరకు మోనికా శర్మకు పంపించినట్లు నకిలీ రశీదును తయారు చేసి బాధితుడికి పంపించాడు. దీంతో బాధితుడు 40 లక్షలు డిపాజిట్ చేశాడు. మోనికా శర్మ సరుకు తీసుకొని వస్తున్నానంటూ ఫోన్ చేసింది. ఆ తర్వాత.. తాను హైదరాబాద్కు వస్తున్న క్రమంలో నాగాలాండ్ ఎయిర్పోర్టులో నన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.. వీటికి పన్ను కట్టలేదు.. విలువైన వస్తువులు కావడంతో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ బాధితుడికి ఫోన్చేసి, రూ.15 లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్టులో రూ.10 లక్షలు వసూలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కూడా తనను పట్టుకున్నారంటూ ఫోన్ చేసి చెప్పడంతో.. తానే స్వయంగా వచ్చి డబ్బు చెల్లిస్తానంటూ బాధితుడు ఫోన్లో మాట్లాడి చెప్పాడు. దీంతో సెల్ స్విచ్ఛాఫ్ చేశారు. పక్క ప్లాన్తోనే నేరగాళ్లు రూ. 87.45 లక్షలు మోసం చేశారంటూ బాధితుడు సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ ప్రమోద్కుమార్ నేతృత్వంలో ఎస్సైలు వినయ్, వెంకటాద్రి బృందం దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా బాధితుడికి పంపించిన ముడి సరుకుకు సంబంధించిన ప్యాకెట్లను పోలీసులు పరిశీలించారు. అందులోని ఓ ప్యాక్లో పది పసుపు కొమ్ములు ప్యాక్ చేసి ఉన్నట్లు గుర్తించారు.
ముంబైలో అరెస్ట్
ముంబైలో నివాసముంటున్న నైజీరియన్లు కొంత మంది భారతీయులను తమ ముఠాలో చేర్చుకొని ఈ మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఓ ప్రత్యేక బృందం ముంబై వెళ్లింది. నిందితుల కోసం గాలించి నైజీరియన్ అయిన ప్రధాన నిందితుడి బంధువు విన్సెంట్ ఇబాద్వాడి, బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేస్తున్న షకీల్, అరవింద్ మిశ్రా, నకిలీ కరెంట్ ఖాతాను తెరిచిన సైఫుల్లా ఖాన్ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన క్రిస్టోఫర్ పరారీలో ఉన్నాడు. అరెస్టయిన నిందితుల నుంచి ల్యాప్టాప్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.