సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): 70 ఏళ్ల వృద్ధుడికి తాము ముంబాయి పోలీసులమంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్ పార్శిల్లో 5 పాస్పోర్టులు, 3 క్రెడిట్కార్డులు, 200 గ్రాముల ఎండీఎంఏ, ఒక ల్యాప్టాప్ ఉంది మీ ఆధార్కార్డు నంబర్ను ముంబాయి కస్టమ్స్లో సీజ్ చేశారంటూ మాట్లాడారు. బాధితుడికి ఏమి అర్థం కాలేదు.. మీతో వీడియో కాల్ మాట్లాడాలి స్కైప్ ఉందా అని అడిగారు.. ఆయన స్కైప్ కనెక్ట్ కావడంతోనే పోలీస్ డ్రెస్లో మెడలో ఐడీ కార్డు వేసుకొని సీబీఐ అధికారిలా మాట్లాడుతున్నారు. మీ ఆధార్కార్డుపై ఐదు బ్యాంకు ఖాతాలు తెరిచారు.
మనీలాండరింగ్ జరిగింది. దీనిని లోతుగా దర్యాప్తు జరుపాలి అందుకు రూ.15,38,312 డిపాజిట్ చేయాలి. ఆ డబ్బులు తిరిగి మీకు రిటర్న్ వస్తాయంటూ నమ్మించారు. వాళ్లు చెప్పే మాటలపై అనుమానం వచ్చిన బాధితుడు వాళ్ల మాటలకు లొంగకుండా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇలా డిజిటల్ లాక్ నుంచి తప్పించుకొని సైబర్ నేరగాళ్లకు గట్టిగా బుద్ది చెప్పాడు. ఇలా 70 ఏళ్ల వృద్ధుడిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఇలాంటి కాల్స్ను అనుమానిస్తూ, సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని సైబర్క్రైమ్ పోలీసులు కోరుతున్నారు.