సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిసిటి బిల్లు పెండింగ్లో ఉంది.. వెంటనే చెల్లించాలంటూ ఒక రిటైర్డు ఉద్యోగికి మెసేజ్ పంపించిన సైబర్నేరగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 10 లక్షలు కాజేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జియాగూడకు చెందిన బాధితుడి సెల్ఫోన్కు ఎలక్ట్రిసిటి బిల్ డ్యూ ఉన్నదంటూ ఒక మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అతడి వాట్సాప్ నంబర్కు ఒక లింక్ పంపించి, దాని ద్వారా మీరు వెంటనే బిల్లు చెల్లించాలంటూ సూచించారు. దీంతో బాధితుడు ఆ లింక్ను క్లిక్ చేయగానే ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ అయ్యింది.
అందులో ప్యాన్ కార్డు నంబర్, బ్యాంకు వివరాలు పొందు పరచాలని సూచించడంతో.. ఆ వివరాలను పూరించాడు. బాధితుడి బ్యాంకు వివరాలను ఎనీడెస్క్ యాప్ నుంచి సేకరించిన సైబర్నేరగాళ్లు అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.10 లక్షలు కొట్టేశారు. ఎనీడెస్క్ లింక్ను ఓపెన్ చేయవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. బాధితుడి ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.