సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ): అక్రమ నల్లా కనెక్షన్దారులపై జలమండలి విజిలెన్స్ అధికారులు కొరఢా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 26 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి డివిజన్ నంబర్- 19 పీర్జాదిగూడ సెక్షన్ పరిధిలో ఉన్న సుమతి టవర్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న నర్సింగ్రావుతోపాటు మరో 25 మంది అనుమతి లేకుండా రెండు 25 ఎంఎం, ఒక 20 ఎంఎం పరిమాణం గల పైపులైన్ కనెక్షన్లు తీసుకుని నీటిని వాడు కుంటున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ విషయం బయటపడింది. దీంతో నర్సింగ్రావుతో పాటు మరో 25 మందిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఐపీసీ 269, 430 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.