Cricket Grounds | సిటీబ్యూరో, డిపెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆటల్లో యువతరానికి క్రికెట్ మించిన క్రేజీ మరో క్రీడకు ఉండదు. గల్లీ నుంచి మైదానం దాకా ఎక్కడ చూసినా చేతిలో బ్యాట్ పట్టుకొని షాట్ కొట్టేందుకు తహ తహలాడుతూ ఉంటారు. అలాంటి క్రేజీ ఉన్న ఆటకు కావాల్సిన మైదానాలు ప్రభుత్వ పరంగా ప్రధానంగా మూడే ఉన్నాయి. వాటిలో మొదటిది ఎల్బీ స్టేడియం, రెండోది జింఖానా గ్రౌండ్ కాగా, మూడోది ఉప్పల్ స్టేడియం ఉంది. కానీ ఈ క్రికెట్ గ్రౌండ్లలో ఎవరు పడితే వారు ఆడలేరు. కనీసం బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉండదు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న క్రికెట్ ఆటకు ఉన్న క్రేజీని కొందరు తమ వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా విశాలమైన క్రికెట్ మైదానం కావాలంటే ఎకరాల్లో భూమి అందుబాటులో ఉండాల్సిందే. అలాంటి పరిస్థితి ఔటర్ రింగు రోడ్డు లోపల కంటే … బయట మాత్రం పుష్కలంగా ఉంది. అందుకే వందల సంఖ్యలో క్రికెట్ మైదానాలు ఔటర్ బయటనే ఉండగా, అందులో మెజార్టీ మైదానాలు ఐటీ కారిడార్కు సమీపంలోనే ఉన్న గండిపేట, హిమాయత్సాగర్, అజీజ్నగర్, మొయినాబాద్, శంషాబాద్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
111 జీవో పరిధిలోనే అత్యధికం…
నగరాన్ని ఆనుకొని ఉన్న జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్సాగర్ చుట్టూ పక్కల ప్రాంతమంతా జీవో 111 పరిధిలో ఉండడంతో వందకు పైగా క్రికెట్ గ్రౌండ్లు ఇప్పుడు క్రికెట్ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి. ఐటీ కారిడార్కు, సంపన్నులు, సెలబ్రెటీలు ఎక్కువగా నివాసముండే ప్రాంతాలకు సైతం 111 జీవో పరిధి సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం ప్రైవేట్ క్రికెట్ మైదానాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఇక్కడి భూముల్లో అధికారికంగా లే అవుట్లు చేయడానికి, ఇండ్ల నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో భూ యజమానులంతా ఆదాయం కోసం తమ భూముల్లో క్రికెట్ గ్రౌండ్లను నిర్మించి అద్దెకిస్తున్నారు. ఇలా ఒక్కో క్రికెట్ గ్రౌండ్ను 1-2 ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మిస్తూ క్రికెట్ టీమ్లకు లీజుకు లేదా మ్యాచ్ల వారీగా, రోజుల వారీగా అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు.
నగరంలో వందల సంఖ్యలో క్రికెట్ టీమ్లు…
విద్యార్థి దశ నుంచే క్రికెట్లో ఆసక్తి ఉన్న వారు తమ స్నేహితులతో క్రికెట్ టీమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా తాము పనిచేసే కార్యాలయంలో, నివాసముండే కాలనీవాసులు, స్కూల్, కాలేజ్ మేట్స్ ఇలా… ఎంతో మంది క్రికెట్ టీమ్లను ఏర్పాటు చేసుకుంటూ ఎప్పుడు సమయం దొరికినా.. ఇతర క్రికెట్ టీమ్లతో కలిసి శివారు ప్రాంతాల్లో ఉన్న మైదానాల్లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని టీమ్లు పోటీలు పెట్టుకొని ప్రైజ్మనీని నిర్ణయించుకొని క్రికెట్ను ఆడుతున్నారు.
ఐటీ ఉద్యోగుల్లో కొందరు వీకెండ్ వచ్చిందంటే చాలు.. తమ జట్లతో క్రికెట్ గ్రౌండ్లలో బ్యాట్, వికెట్లు, బాల్స్తో దిగిపోతున్నారు. డ్రెస్కోడ్తో పాటు పూర్తి స్థాయిలో కోచ్లు పర్యవేక్షణలో మ్యాచ్లను ఆడుతున్నారు. కొందరు ఆరోగ్యంగా ఫిట్నెస్తో ఉండేందుకు క్రికెట్ ఆట పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతూ తరచూ ప్రైవేట్ క్రికెట్ మైదానాల్లో స్నేహితులతో కలిసి ఆడేందుకు వెళ్తున్నారు. ఇలా నగరవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీల్లో వచ్చే కికెట్ చూసి ఎంజాయ్ చేస్తూనే వారంలో ఒక రోజు, లేదంటే సెలవు రోజుల్లో క్రికెట్ ఆడేందుకు అమితాసక్తిని చూపుతున్నారు.
70 శాతం క్రికెట్ మైదానాలు…
క్రికెట్ మైదానాలకు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకొని భూ యజమానులు మైదానాలుగా తీర్చిదిద్ది రోజు, నెలవారీ అద్దెలను పొందుతున్నారు. ఒక మైదానంలో ఒక మ్యాచ్కు రూ.6-7వేల వరకు వసూలు చేస్తుండగా, ఫ్లడ్ లైట్స్ ఉన్న మైదానాలకు రూ.10-13వేల దాకా వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో క్రికెట్ గ్రౌండ్కు నెలకు రూ.1.50 లక్షల నుంచి 2 లక్షల దాకా వస్తోంది. ఇందులో నిర్వహణ ఖర్చులు పోనూ సగం దాకా మిగులుతోందని క్రికెట్ మ్యాచ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ప్రైవేట్ క్రికెట్ మైదానాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సైతం లీగ్ మ్యాచ్లను నిర్వహిస్తుండడంతో మైదానాలకు ఏడాది పొడవునా డిమాండు ఉంటోంది. బహుళ జాతీయ కంపెనీలు (ఎంఎన్సీ) తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు తరచూ మైదానాలను వారం రోజుల పాటు అద్దెకు తీసుకుంటున్నాయి. ఇలా రకరకాల రూపాల్లో డిమాండు ఉండడంతో కొందరు 2-3 ఎకరాల ఖాళీ స్థలాన్ని 5-10 ఏండ్లకు లీజుకు తీసుకొని క్రికెట్ మైదానాలను నిర్మిస్తున్నారు.
ఇలాంటి ఎక్కువగా జీవో 111 పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయని క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఐటీ కారిడార్కు, ఓఆర్ఆర్కు సమీపంలో ఉండడంతో ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండానే క్రికెట్ మైదానాలకు చేరుకునే అవకాశం ఈ ప్రాంతానికి ఉంది. అందుకే తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి చేవెళ్ల వెళ్లే మార్గానికి అటు ఇటూ ఉన్న ప్రాంతంలోనే 50-70 క్రికెట్ గ్రౌండ్లు ఉండగా, మొత్తం నగరంలో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 150 దాకా ఉంటాయని క్రికెట్ ప్లేయర్ శ్రీధర్ తెలిపారు.